భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-2 నేడు కీలక దశకు చేరుకుంది.
ఈ రోజు మధ్యాహ్నం 12:45-1:45 మధ్య ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోనుంది.
జులై 22న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 గత నెల 20న జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించింది.
ఆ తర్వాత నాలుగుసార్లు దాని కక్ష్యను తగ్గించిన ఇస్రో శాస్త్రవేత్తలు ఆదివారం ఐదోసారి మరోమారు దానిని కక్ష్య దూరాన్ని తగ్గించారు.
చంద్రయాన్ -2 కక్ష్య ఇప్పుడు 119×127 కిలోమీటర్లుగా ఉంది.
నేడు చంద్రయాన్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న వెంటనే ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోతుంది.
ఈ ప్రక్రియ 50 మిల్లీ సెకన్లలోనే జరగనుండడం విశేషం.
ఆ తర్వాత రేపు, ఎల్లుండి ల్యాండర్ కక్ష్యను మరోమారు తగ్గించి 35×97 కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశపెడతారు.
ఈ నెల 7న ప్రయోగం చివరి దశకు చేరుకుంటుంది.
చంద్రయాన్-2లోని రాకెట్లను మండించడం ద్వారా దానిని కిందికి దించుతారు.
15 నిమిషాల అనంతరం విక్రమ్ జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి సమీపంలో ల్యాండవుతుంది.
ఇది జరిగిన 4 గంటల తర్వాత అందులోని రోవర్ బయటకు వచ్చి ప్రయోగాలు చేపట్టి ఆ వివరాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు పంపుతుంది.