Editorials

ఆదర్శప్రాయుడు డా.కాకర్ల సుబ్బారావు-జన్మదిన ప్రత్యేకం

The life story of Dr.Kakarla Subbarao-Telugu Editorials

కాకర్ల సుబ్బారావు జననం.జనవరి 25 1925. ఎమ్.బి.బి.యస్., యమ్.ఎస్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఆర్.సి.ఆర్., ఎఫ్.ఐ.సి.పి. ( FRCR, FACR, FICP, FSASMA, FCCP, FICR, FCGP) రేడియాలజిస్ట్ మరియు హైదరాబాదులో నున్న ప్రసిద్ధ ఆసుపత్రి నిమ్స్ పూర్వ డైరెక్టర్.

*** కృష్ణా జిల్లా కూచిపూడి మండలం పెదముత్తేవి గ్రామంలో కాకర్ల సుబ్బారావు వ్యవసాయ కుటుంబంలో జనవరి 25 1925 సంవత్సరంలో జన్మించారు. పాఠశాల విద్యాభ్యాసం చల్లపల్లిలో కళాశాల విద్యాభ్యాసం బందరు లోని హిందు కళాశాలలో 1937-1944 సంవత్సరాల మధ్య జరిపారు. విశాఖపట్టణం ఆంధ్ర వైద్య కళాశాలలో చేరి వైద్య పట్టాని 1950 సంవత్సరంలో సంపాదించారు. 1951 సంవత్సరంలో హౌస్‌ సర్జన్సీ చేసిన తరువాత వైద్యంలో ఉన్నత విద్య కోసం ప్రత్యేక పారితోషికంతో అమెరికా వెళ్ళారు.

*** అమెరికాలో సుబ్బారావు జీవితం
అమెరికాలో వైద్య పరీక్షలైన అమెరికా రేడియాలజి బోర్డు పరీక్షలలో 1955 సంవత్సరంలో ఉత్తీర్ణులై న్యూయార్క్ మరియు బాల్టిమోర్ నగరాలలోని ఆసుపత్రులలో 1954-1956 సంవత్సరం వరకు పనిచేశారు. సుబ్బారావు 1956 సంవత్సరంలో ఇండియా తిరిగి వచ్చి హైదరాబాదు నగరంలో ఉన్న ఉస్మానియా వైద్య కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేరారు. ఆ తరువాత ఉస్మానియా కళాశాలలోనే ప్రధాన రేడియాలజిస్టుగా కుడా పదోన్నతి పొందారు. 1970 సంవత్సరంలో సుబ్బారావు మళ్ళీ అమెరికా ప్రయాణం కట్టారు. యునైటెడ్ కింగ్‌డమ్ వారి ఫెల్లో ఆఫ్ రాయల్ కాలేజి ఆఫ్ రేడియాలజిస్టు (‘Fellow of Royal College of Radiologists (UK) అనే పట్టా సంపాదించుకొన్నారు. అమెరికాలోని అనేక ఆసుపత్రులలో పనిచేశారు. సుబ్బారావు తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మెట్టమెదటి అధ్యక్షుడు మరియు వ్యవస్థాపకులు.

*** భారతదేశానికి తిరిగి రాక
1986 సంవత్సరంలో నందమూరి తారక రామారావు ప్రవాస ఆంధ్రులకు చేసిన విజ్ఞప్తి మేరపు సుబ్బారావు భారతదేశానికి తిరిగి వచ్చి హైదరాబాదులోని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) లో చేరారు. నిమ్స్ ఆసుపత్రి సుబ్బారావు చేరక మునుపు వరకు ఎముకల ఆసుపత్రిగా ప్రసిద్ధి చెందింది. సుబ్బారావు అక్కడ చేరాక అన్ని విభాగాలనూ అభివృద్ధి చేసి రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు కార్పోరేటు ఆసుపత్రులకు దీటైన స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడు నిమ్స్ సంస్థ రాష్ట్ర మరియు దేశ వ్యాప్తంగా రోగుల చికిత్సా పరంగా, వైద్య వృత్తి శిక్షణా పరంగా, వైద్య పరిశోధన పరంగా, పేరెన్నిక కలిగిన వైద్య సంస్థ.సుబ్బారావు రేడియాలజిలో అనేక పుస్తకాలు మరియు జర్నల్స్ లో పరిశోధనా వ్యాసాలు వ్రాశారు. దేశ విదేశాలలో వైద్య ఉపన్యాసాలు ఇచ్చారు. యాభై ఏళ్ల అనుభవంలో అనేక బహుమతులు, సన్మానాలు పొందారు.

*** అవార్డులు
సుబ్బారావు వైద్యశాఖకు, మానవాళికి చేసిన సేవకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 2000 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు ప్రదానం చేసి సత్కరించింది. ఇండియా రేడియాలాజికల్ అండ్ ఇమేజింగ్ అసోసియేషన్ వారి అనుబంధ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చార్టరు సుబ్బారావుకు మార్చి 17, 2001న జీవితకాలపు కృషి అవార్డు ప్రదానం చేశారు. ఆయన ఆంగ్లంలో పలికిన పలుకులు “I pass through this life only once, let me do the maximum good to the largest number of people.”