Politics

జగన్ బినామీ సంస్థల సృష్టికర్త…విజయసాయి

Yanamala Fires The Fire On Vijayasai Reddy

ఐటీ దాడుల సాకుతో తెదేపాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తుస్తున్నట్టు తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో 10 – 15 మంది పీఎస్‌, పీఏలుగా పనిచేశారన్నారు. దేశవ్యాప్తంగా 40 చోట్ల ఐటీ దాడులకు తెదేపాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కేసుల నుంచి జగన్‌ తప్పించుకోవడానికి ఎదుటివాళ్లపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎదుటివాళ్లపై దాడులు చేయడమే జగన్‌ లక్ష్యంగా పెట్టుకున్నారంటూ ద్వజమెత్తారు. తెదేపాపై ఫిర్యాదుల కోసమే విజయసాయిరెడ్డికి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారనీ.. దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కూడా నియమించింది అందుకేనని విమర్శించారు. జగన్‌ షెల్‌ కంపెనీల సృష్టికర్త కూడా విజయ సాయిరెడ్డేనన్నారు. జగన్‌ రూ.43వేల కోట్ల అక్రమాస్తుల విచారణ తుది దశకు చేరిందన్న యనమల.. రూ.4వేల కోట్ల జగన్‌ ఆస్తులను ఈడీ జప్తు చేసిందన్నారు. శిక్ష తప్పదని తెలిసే ట్రయల్స్‌ను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హైకోర్టులో సీబీఐ పిటిషన్‌కు జగన్‌ సమాధానం చెప్పాలన్నారు. రివర్స్‌ టెండర్‌ కాంట్రాక్టు ఇచ్చిన ఇన్‌ఫ్రా కంపెనీపై దాడికి, తెదేపాకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. సోదాలు జరిగిన ఇన్‌ఫ్రా కంపెనీకే కాంట్రాక్టులు మీరు ఇవ్వలేదా అని వైకాపాను ప్రశ్నించారు. 16 నెలలు జైలు, 16 చార్జిషీట్‌లు ఉన్న వాళ్లకు నైతిక హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. ఎనిమిదేళ్లుగా కేసుల నుంచి తప్పించుకు తిరిగేవాళ్లు తెదేపాను విమర్శించడం దారుణమన్నారు. తెదేపాపై సాక్షి మీడియా, వైకాపా నేతల విష ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. విష ప్రచారాన్ని మానుకోకపోతే న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.