Politics

తోట త్రిమూర్తులుపై చెప్పుతో దాడి

YSRCP Ex-MLA Thota Trimurthulu Attacked With Sandal

మాజీ ఎమ్మెల్యే, అమలాపురం వైకాపా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు తోట త్రిమూర్తులుకు చేదు అనుభవం ఎదురైంది. తూర్పు గోదావరి జిల్లా ద్రాక్షారామంలో ఓ వ్యక్తి ఆయనపై చెప్పుతో దాడికి యత్నించాడు. వివరాల్లోకి వెళితే.. ఈ మధ్యాహ్నం ద్రాక్షారామం భీమేశ్వరాలయానికి మంత్రి మోపిదేవి వెంకటరమణ, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. వారితో పాటు తోట త్రిమూర్తులు కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవితో పాటు త్రిమూర్తులు కారు నుంచి దిగుతుండగా కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇజ్రాయెల్‌ అనే వ్యక్తి త్రిమూర్తులపై చెప్పుతో దాడి చేయబోయాడు. వెంటనే స్పందించిన మోపిదేవి భద్రతా సిబ్బంది అతన్ని అక్కడి నుంచి నెట్టివేశారు. ఇజ్రాయెల్‌ ఎందుకు ఈ ఘటనకు పాల్పడ్డాడనే విషయం తెలియరాలేదు. తొలుత ఈ విషయం ఎవరికీ తెలియకపోయినా ఆ తర్వాత సామాజిక మాధ్యమాల ద్వారా వైరల్‌ అయింది.