WorldWonders

నిర్భయ దోషుల మరో న్యాయ లీల

Nirbhaya Convicts Goes To ICJ

సంచలనం సృష్టించిన నిర్భయ అత్యాచారం, హత్య కేసులో ఉరితీత నుంచి తప్పించుకునేందుకు దోషులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పటికే చివరి నిమిషంలో పిటిషన్లు, క్షమాభిక్ష అభ్యర్థనలతో దోషుల ఉరిశిక్ష అమలు మూడు సార్లు వాయిదా పడిన విషయం తెలిసిందే. కొత్త ఆదేశాల ప్రకారం మార్చి 20న వీరిని ఉరితీయాల్సి ఉండగా.. ఇప్పుడు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) ఆశ్రయించారు. ఉరిశిక్షపై స్టే విధించాలని కోరుతూ దోషులు అక్షయ్‌, పవన్‌ గుప్తా, వినయ్‌ శర్మ ఐసీజేలో పిటిషన్‌ దాఖలు చేశారు. పలు వాయిదాల అనంతరం నిర్భయ దోషులను మార్చి 20 ఉదయం 5.30గంటలకు ఉరితీయాలంటూ దిల్లీ పటియాలా హౌస్‌ కోర్టు ఇటీవల కొత్త డెత్‌ వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే. నిజానికి జనవరి 22నే వీరిని ఉరితీయాల్సి ఉండగా.. న్యాయపరమైన అవకాశాల పేరుతో చివరి నిమిషంలో దోషులు కొత్త పిటిషన్లు, దరఖాస్తులు పెట్టుకోవడంతో మూడు సార్లు ఉరితీత వాయిదా పడింది. ఇప్పటికి కూడా దోషులు శిక్ష నుంచి తప్పించుకునేందుకు తమ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తమకున్న న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధరించాలని కోరుతూ దోషుల్లో ఒకడైన ముకేశ్‌ కుమార్‌ ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అయితే అతడి అభ్యర్థనను న్యాయస్థానం నేడు కొట్టివేసింది. తాజాగా మిగతా ముగ్గురు దోషులు ఐసీజేను ఆశ్రయించడంతో ఉరిశిక్షపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి.