Politics

టెలీ మెడిసిన్ సేవలను విస్తరించండి

AP CM Jagan Orders Tele Medicine Expansion

కరోనా లాంటి విపత్తులను ఎదుర్కోవడానికి ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాలను మెరుగు పర్చుకోవడం చాలా అవసరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ కీలక పాత్ర పోషిస్తాయని సీఎం వ్యాఖ్యానించారు. కొవిడ్- 19 నిరోధక చర్యలపై సమీక్షించిన ఆయన శ్రీకాకుళం జిల్లాలోనూకరోనా కేసులు వెలుగు చూసినందున ఆ జిల్లాలో దీని పర్యవేక్షణకు ఓ ప్రత్యేక అధికారిని నియమించాలని అధికారులను ఆదేశించారు. కరోనా పరీక్షల కోసం ల్యాబ్‌లు లేని మిగిలిన జిల్లాల్లో ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇదివరకే నిర్ణయించిన విధంగా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిని కొవిడ్‌ ఆస్పత్రిగా మార్చాలని సీఎం స్పష్టం చేశారు. ఏపీలో టెలీ మెడిసిన్‌ను శాశ్వత ప్రాతిపదికన నడపాలని సీఎం ఆదేశించారు. కాల్‌ చేసిన వారికి ప్రిస్కిప్షన్లు ఇవ్వడమే కాకుండా వారికి మందులు కూడా పంపించాలని, దీనివల్ల ప్రజలకు మేలు జరుగుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయ పడ్డారు. టెలీ మెడిసిన్‌ టోల్ ఫ్రీ నెంబరు 14410కు మరింత ప్రచారం కల్పించాలని సీఎం సూచించారు.