Devotional

గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

2020 Govindaraja Swamy Brahmotsavams Begin

ధ్వజారోహణంతో ప్రారంభ‌మైన శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం 8.00 నుండి 9.30 గంటల మద్య మిథున లగ్నంలో ప్రారంభమయ్యాయి.

వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.

ఆనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.

అంత‌కుముందు అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీభూ సమేత గోవిందరాజస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం.

ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10.00 నుండి 11.00 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది.

ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంల‌తో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేశారు.

క‌రోనా వ్యాధి వ్యాప్తి నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు ఉద‌యం, రాత్రి మాడ వీధుల్లో  వాహ‌న‌సేవ‌ల ఊరేగింపును ర‌ద్దు చేశారు.

ఇందులో భాగంగా గురువారం సాయంత్రం 5.00 గంట‌ల‌కు పెద్దశేష వాహన‌ సేవ‌ను ఆల‌య ప్రాంగ‌ణంలోనే ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.
         
ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, ఆలయ ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమతి వరలక్ష్మీ, ఏఈవో శ్రీ ర‌వికుమార్‌‌ రెడ్డి, ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ భ‌ట్టార్ ఏ.పి.శ్రీ‌నివాస‌దీక్షితులు పాల్గొన్నారు.