DailyDose

కొడాలిపై పోలీసు ఫిర్యాదు చేసిన ఉమ-నేరవార్తలు

కొడాలిపై పోలీసు ఫిర్యాదు చేసిన ఉమ-నేరవార్తలు

* మంత్రి కొడాలి నాని పై దేవినేని ఉమ ఫిర్యాదు మంత్రి కొడాలి నానిపై టీడీపీ నేత దేవినేని ఉమ ఫిర్యాదు చేశారు.తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో దేవినేని ఉమ, టీడీపీ నేతలు కంప్లైంట్ చేశారు. కొడాలి నాని సహా ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, వంశీపై ఫిర్యాదు చేశారు.లారీతో తొక్కించి చంపుతామని తమను బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంత్రి అలా అనడమేంటి?సీఎం జగన్ ప్రేరణతో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు కృష్ణప్రసాద్, వంశీ బెదిరిస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు.లారీతో తొక్కిస్తా అని మంత్రి నాని అనడం ఏంటి? ఇది రాజ్యాంగ ఉల్లంఘన కాదా? మంత్రి కొడాలి నాని మాటల వెనుక సీఎం జగన్ ఉన్నారన్నారు.కొడాలి నానిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని దేవినేని ఉమ డిమాండ్ చేశారుచంద్రబాబుపై, దేవినేని ఉమపై మంత్రి కొడాలి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేత బచ్చుల అర్జునుడు విమర్శించారు.రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అవుతోందని ధ్వజమెత్తారు.ప్రతిపక్ష నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.ప్రశ్నించిన వారిపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.వైసీపీ అరాచక పాలనపై ప్రజల తిరుగుబాటు తప్పదన్నారు.

* కొత్తచెరువు మండల పరిధిలోని గుంటిపల్లి వద్ద వేరుశనగ కట్టి నూర్పిడియంత్రం అదుపుతప్పి బోల్తపడడంతో అప్పలవాండ్లపల్లి తాండా కుచెందిన శాంతా బాయి(28) ప్రమిలాబాయి(35) అనే ఇద్దరు మహిళా కూలీలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది.

* అయిదో తరగతితోనే చదువు ఆపేశాడు. కానీ పెద్ద వైద్యుడిగా చలామణి అయ్యాడు. ప్రముఖ ఆసుపత్రుల్లో పని చేశాడు. రాచకొండ పోలీసులకే మస్కా కొట్టాడు. సీనియర్‌ పోలీసు అధికారులకే ప్రత్యేక తరగతులు నిర్వహించాడు. కరోనా బారిన పడిన పోలీస్‌ సిబ్బందికి వైద్యం అందించాడు. చివరకూ రౌడీషీట్‌ ఎత్తేయిస్తానంటూ రూ.5 లక్షలు వసూలు చేయడంతో అనుమానమొచ్చి ఆరా తీయడంతో ఈ కేటుగాడి గుట్టు రట్టయ్యింది. నకిలీ వైద్యుడిగా చలామణీ అవుతున్న వైఎస్‌ తేజ అలియాస్‌ తేజారెడ్డి అలియాస్‌ అవినాష్‌రెడ్డి అలియాస్‌ వీరగంధం తేజ(23), ఒంగోలులోని గీతాంజలి కన్సల్టెన్సీ నిర్వాహకుడు బోకూడి శ్రీనివాస్‌రావు(50), వైఎస్‌ తేజ తండ్రి వీరగంధం వెంకటరావు(41)ను రాచకొండ పోలీసులు అరెస్ట్‌ చేశారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో సాయపడిన మరో ఆరుగురు పరారీలో ఉన్నారు. 21 రకాల నకిలీ ధ్రువీకరణ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

* అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్‌లోని తూర్పు ప్రావిన్స్‌ నన్గర్‌హార్‌ ప్రాంతంలోని పలు సైనిక స్థావరాలపై దాడి చేసి 16 మంది సైనికులను హతమార్చారు. ఈ దాడిలో పలువురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గండుమాక్‌ ప్రాంతంలోని పోలీసులు, సైనికులకు చెందిన మూడు శిబిరాలపై ఏకకాలంలో తుపాకులు, బాంబులతో ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. తాలిబాన్ ఖైదీలను విడుదల చేసే యోచనతో శనివారం ఖతార్‌లో ప్రారంభం కానున్న శాంతి చర్చలకు ముందే ఈ దాడి జరగడం గమనార్హం.

* పుట్టుకతోనే మూగ, చెవుడు సమస్యలున్న ఆ దివ్యాంగుల మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. అయితే వారి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో కలత చెందిన వారు.. నల్గొండ జిల్లా అనుముల మండలం పాలెం గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం మేరకు.. నిజామాబాదు జిల్లా ఎడవల్లి మండలం జక్కంపేట గ్రామానికి చెందిన నందిపాటి అశ్విని (20), గుంటూరు నగరంలోని శ్రీనివాసరావుపేటకు చెందిన షేక్‌ మస్తాన్‌వలీ (27) హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని అమెజాన్‌ సంస్థలో పనిచేస్తున్నారు. అక్కడ వీరిమధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసింది. పెళ్లి చేసుకోవాలనుకున్నా.. మస్తాన్‌వలీకి ఇదివరకే మరో దివ్యాంగురాలితో వివాహం జరగడంతో అశ్విని తల్లి నిరాకరించింది. దీంతో ఈనెల 7న హైదరాబాద్‌ నుంచి వచ్చిన వారిద్దరూ గురువారం తెల్లవారుజామున పాలెం శివారులో పెట్రోల్‌తో నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు హాలియా సీఐ వీరరాఘవులు, ఎస్‌ఐ శివకుమార్‌ అక్కడికి చేరుకుని సంఘటనపై కేసు నమోదు చేశారు. గుర్తింపు కార్డుల ఆధారంగా మృతుల బంధువులకు సమాచారం అందించారు. ఘటన జరగటానికి గంట ముందు అశ్విని తాము చనిపోతున్నట్లు సైగలతో సూచిస్తూ వీడియో తీసి స్నేహితులకు సందేశం పంపారు. దీంతో చనిపోవద్దని, ఎక్కడ ఉన్నారో తెలపాలని స్నేహితులు కోరారు. అయినా అశ్విని స్పందించలేదని.. వీరి మరణవార్త తెలిసిన తర్వాత హాలియాకు వచ్చిన స్నేహితులు తెలిపారు.

* టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో గంటకో ట్విస్ట్‌ వెలుగుచూస్తోంది. తాజాగా శ్రావణిపై సాయి దాడి చేసిన సీసీ ఫుటేజ్‌ బయటపడింది. ఆత్మహత్యకు ముందు శ్రీకన్య హోటల్‌లో శ్రావణిని దేవరాజ్‌ను కలిసేందుకు రాగా.. అక్కడేఉన్న సాయి శ్రావణిపై దాడికి పాల్పడ్డాడు. అయితే శ్రావణి ఆత్మహత్య కేసులో ఈ సీసీ ఫుటేజ్‌ కీలకం కానుంది. ప్రస్తుతం విచారణలో భాగంగా పోలీసులు ఆ ఫుటేజులు పరిశీలిస్తున్నారు. మరోవైపు సాయి, దేవ్ రాజ్ మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ బయటికొచ్చింది. ఆ ఆడియోలో శ్రావణి కోసం వీరిద్దరు గొడవపడ్డారు. కుటుంబ సభ్యులు, సాయి కలిసి శ్రావణి ‌బెదిరిస్తున్న సమయంలో దేవరాజ్ ఆ ఆడియోను రికార్డు చేశాడు.