Politics

భారతీయుల క్రమశిక్షణ భేష్-తాజావార్తలు

Modi Calls Indian's Discipline Exemplary - Telugu News Roundup

* గతేడాది దేశవ్యాప్తంగా చేపట్టిన జనతా కర్ఫ్యూలో భారతీయులు చాటిన క్రమశిక్షణ ప్రపంచానికి ఉదాహరణగా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమం 75 ఎడిషన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ శ్రోతలకు ధన్యవాదాలు తెలిపారు.

* కృష్ణాజిల్లాలో రోజు రోజుకీ కరోనా పాజిటీవ్ కేసుల్లో సంఖ్య రోజురోజుకీ పెరుగతుంది.సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరమని వైద్యుల హెచ్చరికలు.తమకేమీ పట్టనట్టు మాస్క్ లు లేకుండా తిరుగుతున్న ప్రజలు.వర్తక, వాణిజ్య సంస్థలు, జనసంచార ప్రాంతాల్లో కానరాని సామాజిక దూరం.

* కరోనా కేసుల ఉధృతి నేపథ్యంలో కోవిడ్ నియమ నిభందనలు పాటించండి – ఆంధ్ర ప్రదేశ్ డిజిపి శ్రీ గౌతమ్ సవాంగ్, ఐపిఎస్.ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రభావం రోజు రొజుకీ పెరుగుతున్న దృష్ట్యా ప్రజలందరూ స్వీయ జాగ్రతలు పాటించాలని డీజీపీ పిలుపునిచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సంబంధిత శాఖలను తగు చర్యల నిమిత్తం సమాయత్తం చేసినట్లు వారు తెలిపారు.పెరుగుతున్న కరోనా కేసుల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్న దరిమిలా నియంత్రణ చర్యలు కఠినంగా అమలు చేయదలిచామని, అందు నిమిత్తం పోలీసు శాఖ కు ప్రజలందరూ సహకరించ వలసిందిగా అభ్యర్థించారు.

* ప్రభుత్వంలో కీలక పదవుల్లో పనిచేసిన వారికి ఐదేళ్లు ఏ బాధ్యతల్లో అవకాశం ఇవ్వకుండా చట్టం తేవాలని సీపీఐ నారాయణ అన్నారు. నోటా ఉన్నపుడు ఏకగ్రీవాలను అంగీకరించకుండా చట్టం తేవాలని సూచించారు. స్వాతంత్యం తర్వాత శ్రామికులు సాధించుకున్న ఆస్తులను మోదీ అమ్మేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోర్ట్‌లు, ఎయిర్‌పోర్ట్‌లు అదానికి, మిగిలింది అంబానికి ఇచ్చేస్తున్నారని చెప్పారు. తిరుపతి ఉపఎన్నికల్లో సీపీఐ కరపత్రాలు పంచినట్టు వైసీపీ కరెన్సీ పంచుతోందని విమర్శించారు. రాజకీయ పార్టీల్లో సిద్ధాంతపరమైన ఐక్యత అవసరమన్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో మద్దతుపై రేపటి వరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

* తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 57,942 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 535 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలో నిన్న కరోనాతో ముగ్గురు మరణించారు. కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1688కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 278 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,495 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 1,979 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 154 కేసులు నమోదయ్యాయి.

* ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని భావించి, చివరిసారిగా ఫేస్బుక్ లో తన స్నేహితులకు పంపిన సందేశం వరమైంది. రైలు పట్టాలపై పడుకున్న ఆయన్ను కాపాడేలా చేసింది. వివరాలిలా ఉన్నాయి.గత పదిహేనేళ్లుగా కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోని వివిధ హోటళ్లలో పనిచేస్తున్న సతీష్‌ అనే యువకుడు ‘లాక్‌డౌన్‌’ నేపథ్యంలో పనుల్లేక తన స్వస్థలమైన అనంతపురం వెళ్లిపోయారు. అయితే ఆయన కొంతకాలంగా ‘ఫేస్‌బుక్‌’ ద్వారా ఇక్కడున్న మిత్రులతో మాట్లాడుతూనే ఉన్నారు. జీవితంపై విరక్తితో ఈ లోకం నుంచి సెలవు తీసుకొంటున్నానంటూ ఆయన శనివారం మధ్యాహ్నం తన స్నేహితులకు ఓ సందేశం పంపారు.

* ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 31,142 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,005 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 8,98,815 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ బారినపడి చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,205కు చేరింది.

* అనారోగ్యంతో మృతిచెందిన బద్వేలు వైకాపా ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య పార్థివదేహానికి ఏపీ సీఎం జగన్‌ నివాళులర్పించారు. కడప వెళ్లిన ఆయన.. వెంకట సుబ్బయ్య భౌతికకాయం వద్ద అంజలి ఘటించి కుటుంబసభ్యులను పరామర్శించారు.

* అన్నదాతల ఆత్మహ‌త్యలు రాష్ట్రానికి మంచివి కాదని.. వెంట‌నే రైతుల‌ను ర‌క్షించుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. తెరాస అధికారం చేపట్టినప్పటి నుంచి రైతుల‌కు అన్యాయం జరుగుతూనే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. భూమి ఉన్న రైతుల‌కు అర‌కొర డ‌బ్బులు ఇస్తున్న స‌ర్కార్.. కౌలు రైతుల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదని ఆరోపించారు. ఈ మేరకు రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు కోమటిరెడ్డి లేఖ రాశారు.

* తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలో తనను గెలిపిస్తే రాష్ట్రం తరఫున పార్లమెంట్‌లో గట్టి స్వరం వినిపిస్తానని భాజపా-జనసేన అభ్యర్థి రత్నప్రభ అన్నారు. ఇన్నాళ్లకు మాతృభూమికి సేవ చేసే అవకాశం తన ముందుందని చెప్పారు. పనిచేయడంలోనే తనకు అమితానందం ఉంటుందన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తిరుపతి కోసమే కాకుండా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేస్తానన్నారు.

* సహజీవనంలో ఉంటూ పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొన్న వారిపై పోక్సో చట్టం కింద శిక్ష విధించాలా? వద్దా? అనే అంశంపై స్పందించాల్సిందిగా తమిళనాడు ప్రభుత్వాన్ని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్‌ ఇందిరా బెనర్జీ, జస్టిస్‌ కృష్ణ మురారీతో కూడిన ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తమిళనాడుకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ఆమెతో సహజీవనం చేశాడు. అయితే, వివాహానికి నిరాకరించడం వల్ల ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యువకునిపై అత్యాచారం కేసు నమోదైంది. తనపై అత్యాచారం జరగలేదని, ఇష్టపూర్వకంగానే శృంగారంలో పాల్గొన్నట్లు విచారణలో యువతి వెల్లడించింది. తిరిగి ఆ యువకునితో కలిసి జీవించడానికి సుముఖంగా ఉన్నట్లు తెలిపింది. యువతి వాదనలను తిరస్కరించిన దిగువ కోర్టు.. పోక్సో చట్టాన్ని అనుసరించి యువకుడికి 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధించింది. యువతికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. భిన్న పరిణామాల అనంతరం మద్రాసు హైకోర్టుకు చేరిన ఈ అంశంపై యువతీయువకులిద్దరూ ఒకే వాదనలు వినిపించారు. తమ సంబంధం పరస్పర అంగీకారంతో కూడినదని మద్రాసు హైకోర్టు ఎదుట యువతి సాక్ష్యమిచ్చింది. ఆ వాదనను తోసిపుచ్చిన న్యాయస్థానం ఆమె పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో యువతి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మద్రాస్‌ హైకోర్టు తీర్పుపై వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. యువకుడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

* జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం పెద్దాపూర్‌లో మల్లన్న స్వామి బోనాల జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు సుమారు 50 వేలకు పైగా బోనాలను స్వామికి సమర్పించారు. ఏడాదికోసారి హోలీ తరువాత వచ్చే ఆదివారం రోజుల పెద్ద ఎత్తున మల్లన్నస్వామి జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బోనాల కార్యక్రమాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు పెద్దఎత్తున ఆలయానికి తరలివచ్చారు. మల్లన్నకు బెల్లంతోపాటు గొర్రెపిల్లలను కానుకలుగా సమర్పించారు. బోనాల జాతర సందర్భంగా శివసత్తుల నృత్యాలు, పూనకాలు అమితంగా ఆకట్టుకున్నాయి. అంతకుముందు కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌ రావు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.