Sports

మిథాలీ రిటైర్మెంట్

మిథాలీ రిటైర్మెంట్

వచ్చే ఏడాది న్యూజిలాండ్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని టీమ్‌ఇండియా వన్డే కెప్టెన్‌ మిథాలి రాజ్‌ పేర్కొన్నారు. ‘1971 ది బిగినింగ్‌ ఆఫ్‌ ఇండియా క్రికెటింగ్‌ గ్రేట్‌నెస్‌’ అనే పుస్తకావిష్కరణ కార్యక్రమం (వర్చువల్‌ పద్ధతి)లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే 21 ఏళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగుతున్నానని, 2022లో న్యూజిలాండ్‌లో జరిగే ప్రపంచకప్‌ తన చివరి సిరీస్‌ అని స్పష్టం చేశారు. ‘20 ఏళ్ల నా అంతర్జాతీయ కెరీర్‌ మొత్తం 2020 ఒక్క ఏడాదితో సమానంగా మారింది. ప్రస్తుతం మనం విపత్కర పరిస్థితుల్లో ఉన్నామని తెలుసు. అయినా ఫిట్‌నెస్‌పై దృష్టిసారించాలి. అదెంత ముఖ్యమో తెలుసు. అందుకోసం నేను బాగా కష్టపడాలి. రోజురోజుకూ నా వయసు పైబడుతోంది. వన్డే ప్రపంచకప్‌ ముందు ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ పర్యటనలు ఉన్నాయి. అలాగే మధ్యలో వెస్టిండీస్‌తో హోమ్‌ సిరీస్‌ కూడా ఉంది. ఇవన్నీ తెలిసి మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండటం ఎంతో ముఖ్యం’ అని మిథాలి చెప్పుకొచ్చారు.