Movies

ఛార్మీ…మీ ఫోనులో దాదా పేరు ఎవరిది?-ఈడీ

ఛార్మీ…మీ ఫోనులో దాదా పేరు ఎవరిది?-ఈడీ

తెలుగు సినీ పరిశ్రమ మత్తుమందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. గత నెల 31న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విచారణకు హాజరు కాగా.. గురువారం నటి ఛార్మి ఈడీ కార్యాలయానికి వచ్చారు. తన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌తో కలిసి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. కార్యాలయంలోని మూడో అంతస్తులో ఈడీ సంయుక్త సంచాలకుడు అభిషేక్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందం విచారించింది. తన రెండు బ్యాంకు ఖాతాల వివరాల్ని ఛార్మి అధికారులకు సమర్పించారు. వాటిలో తమకు అనుమానంగా కనిపించిన లావాదేవీల గురించి అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మాదకద్రవ్యాల సరఫరాదారు కెల్విన్‌తో గల సంబంధాల గురించి అధికారులు ఆరా తీశారు. మాదకద్రవ్యాల కొనుగోలు నిమిత్తం కెల్విన్‌కు డబ్బు ఇచ్చారా? అని ప్రశ్నించారు. కెల్విన్‌తో ఫోన్‌ సంభాషణలు, వాట్సప్‌ ఛాటింగ్‌ చేశారా? అని అడిగారు. ఆన్‌లైన్‌లో అతడి ఖాతాకు డబ్బు పంపించారా? అని ఆరా తీశారు. దాదా పేరుతో ఉన్న ఫోన్‌ నంబరుకు కాల్స్‌ చేశారా? అని ప్రశ్నించారు. అయితే కెల్విన్‌ గురించి తనకేమీ తెలియదని.. అతడితో తనెలాంటి లావాదేవీలు జరపలేదని ఛార్మి బదులిచ్చినట్లు తెలిసింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఛార్మి వ్యాపార లావాదేవీలు కలిగి ఉండటంతో వాటి గురించీ ఆరా తీసినట్లు సమాచారం. అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు ఆమెను పంపించివేశారు.