Movies

అశ్లీల యూట్యూబ్ ఛానెళ్లపై సీసీఎస్‌లో కరాటే కల్యాణి ఫిర్యాదు

అశ్లీల యూట్యూబ్ ఛానెళ్లపై సీసీఎస్‌లో కరాటే   కల్యాణి ఫిర్యాదు

యూట్యూబ్ ఛానెళ్లపై సీసీఎస్‌లో కరాటే కళ్యాణి ఫిర్యాదు చేసింది. ఇటీవలే యూట్యూబ్ ప్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిని చితక్కొట్టిన కరాటే కళ్యాణి ..ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేసిన సంగతీ తెలిసిందే. ‘యూట్యూబ్‌లో ప్రాంక్ వీడియోలు చేస్తూ శ్రీకాంత్ రెడ్డి , అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తన దృష్టికి వచ్చింది. దీని గురించి మాట్లాడేందుకు వెళ్తే తనపైన.. తన చేతిలో ఉన్న పాపపైన దాడి చేశాడు’.. అని కరాటే కల్యాణి ఆరోపించింది. యూసుఫ్ గూడలో జరిగిన గొడవ తర్వాత పలు మీడియా ఛానళ్ళతో కరాటే కల్యాణి మాట్లాడింది.
ఈ నేపథ్యంలో మహిళలను కించపరుస్తూ అసభ్యకరంగా వీడియోలు చేస్తే సహించేది లేదని చెప్పింది. అవసరమైతే సైబర్ క్రైమ్స్ లోనూ దీనిపై ఫిర్యాదు చేసి, ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఇదే విషయమై తాజాగా కళ్యాణి అసభ్యకర ప్రాంక్ వీడియోలు చేస్తున్న యూట్యూబర్స్ పై సీసీఎస్‌లో పిర్యాదు చేసింది. ఇరవైకి పైగా యూట్యూబ్ ఛానెళ్లపై సాక్ష్యాలతో సహా సీసీఎస్ పోలీసులకు పిర్యాదు చేయగా..ఐటీ యాక్ట్ లోని 67 A, 509 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలోనే ఈ యూట్యూబ్ ఛానెళ్లకు నోటీసులు పంపనున్నారు.ఇక ఇప్పటికే ఆయా యూట్యూబ్ ఛానెళ్లపై నిఘా పెట్టారు. అలాగే, ఈ కేసు విచారణకు ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. ‘యూట్యూబ్ లో అశ్లీల వీడియోలపై చర్యలు తీసుకోవాలి. నేను ఆధారాలతో సహా సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేశాను. ఇంటికి పాల ప్యాకెట్ ఎలా వస్తుందో, అలాగే యూట్యూబ్‌లో ఈ అశ్లీల వీడియోలు వస్తున్నాయి. అశ్లీల వీడియోలతో లక్షలు రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా ఒకరిని చూసి ఒకరు అశ్లీల ప్రాంక్ వీడియోలు చేస్తూ డబ్బు సంపాదనే లక్ష్యంగా పెట్టుకున్నారు’..అని తెలిపింది.