Politics

సీఎం జగన్ సభలకు హాజరయ్యేందుకే డ్వాక్రా సంఘాలు:చంద్రబాబు

సీఎం జగన్ సభలకు హాజరయ్యేందుకే డ్వాక్రా సంఘాలు:చంద్రబాబు

కొవ్వూరు: మహిళా శక్తి అంటే ఏంటో మళ్లీ ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం వచ్చిందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు.పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకొని రాష్ట్రంలోని మహిళలను ఎవరు పైకి తీసుకొచ్చారో.. ఎవరు మోసం చేస్తున్నారో బేరీజు వేసుకోవాలని మహిళలకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. కొవ్వూరులోని డ్వాక్రా, అంగన్వాడీ, పొదుపు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ.. ”డ్వాక్రా సంఘాల స్వయం సాధికారత స్ఫూర్తిని సీఎం జగన్‌ దెబ్బతీశారు. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి.. కానీ, అమలు మాత్రం గడప దాటట్లేదు. ఇచ్చే డబ్బుకు, సీఎం దోచుకునే దానికి పొంతన లేదు. మహిళలు తమ ఇంటి ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోవాలి. గత 4ఏళ్లలో మీ ఖర్చులు పెరిగిపోయాయా.. లేదా? అనేది చూసుకోవాలి. మీ కొనుగోలు శక్తి తగ్గిందో లేదో ఆలోచన చేయాలి. కేవలం తన సభలకు హాజరు కావడం కోసమే డ్వాక్రా సంఘాలను సీఎం జగన్‌ వినియోగించుకుంటున్నారు. మహిళల ఆత్మగౌరవానికి తెదేపా మరుగుదొడ్లు కట్టిస్తే, వాటిపైనా పన్ను విధించిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కుతుంది. తెదేపా అధికారంలోకి రాగానే మళ్లీ డ్వాక్రా సంఘాలను బలోపేతం చేస్తాం. మహిళలను ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం” అని చంద్రబాబు తెలిపారు.