Business

రైల్వే బాటలో తెలంగాణ ఆర్టీసీ.. వందే భారత్ తరహాలో కొత్త బస్సులు

రైల్వే బాటలో తెలంగాణ ఆర్టీసీ.. వందే భారత్ తరహాలో కొత్త బస్సులు

రైల్వే బాటలో తెలంగాణ ఆర్టీసీ (TSRTC) నడుస్తోంది వందే భారత్ (Vande Bharat) రైల్వే మాదిరిగా పలు కొత్త సూపర్ లగ్జరీ బస్సులు (Super Luxury Buses) ప్రవేశపెట్టింది .ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది డిపోలు ఉండగా ఐదు డిపోలకు 16 కొత్తవి వచ్చాయి. అత్యంత అధునాతన హంగులు, విలాసవంతమైన సదుపాయాలతో కూడిన ఇవి ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పది లక్షల కిలోమీటర్లు తిరిగిన బస్సులను తొలగించగా వాటి స్థానంలో ఈ సూపర్ లగ్జరీ బస్సులు వచ్చాయి. పాత బస్సులు 160 హెచ్‌పీ సామర్థ్యంతో కూడినవి, కాగా నూతన సర్వీసులో 200 హెచ్‌పీని కలిగి ఉన్నాయి .ఈ బస్సుల వేగాన్ని 80 కిలోమీటర్లకు పరిమితం చేశారు .ఈ బస్సు ఆకర్షణీయంగా ఉండటంతో ప్లాట్ ఫారం మీదకు రాగానే క్షణాల్లో నిండిపోతుంది. 36 సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ బస్సులో పాత వాటితో పోలిస్తే అనేక కొత్త హంగులు అమర్చారు.

ఈ బస్సులలో ప్రయాణికులకు కొత్తగా అనుభూతి కలిగే విధంగా పలు సౌకర్యాలు ఉన్నాయి . బస్సు డ్రైవర్ గమ్యం స్థానానికి రాగానే మైక్ ద్వారా ప్రయాణికులకు తెలియజేస్తారు.ఏదైనా ప్రమాదం జరిగితే అద్దాలు పగలగొట్టి ప్రయాణికులు బయటకు వచ్చేందుకు అద్దాలు పగలగొట్టే పరికరం ఉంటుంది. బస్సు ముందు భాగాన వెనుక భాగంలో రెండు కెమెరాలు, ప్రయాణికుడు కూర్చునే చోట యూఎస్బీ చార్జింగ్ పాయింట్లు, బస్సు తలుపులు తెరుచుకునేందుకు ఎమర్జెన్సీ స్విచ్, బస్సు ప్రయాణికుల సామాను భద్రత కోసం డ్రైవర్ వెనకాల క్యాబిన్‌కు సీసీ కెమెరాను అమర్చారు. వాటి పక్కనే ఎమర్జెన్సీ అలారం ఏర్పాటు చేశారు. బస్సులో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే రెడ్ లైట్ వెలిగి సైరన్ మోగుతూ అప్రమత్తం చేస్తుంది.

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కాలుష్యం నియంత్రించే భారత్ స్టేజ్ 6 బిఎస్ 6 బస్సుల్లో ప్రత్యేక ఏర్పాటు చేశారు. కాలుష్యం వెదజల్లకుండా స్టాండ్ యాడ్ బ్లూ ట్యాంకును అమర్చారు. బస్సు నడిచే సమయంలో డీజిల్‌లో యాడ్ బ్లూ ట్యాంక్ లోని ద్రవణం కలిసి కార్బన్ డయాక్సైడ్ బయటకు రాకుండా అరికడుతుంది. సైలెన్సర్ వద్ద హీట్స్ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ బస్సుకు మొత్తం 16 సెన్సార్లు అమర్చారు. డ్రైవర్లు గతంలో మాదిరిగా కాకుండా గమనిస్తూ సెన్సార్ విధానాన్ని అనుసరిస్తారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన విలాసవంతమైన అనుభూతిని కలిగించే ఈ బస్సులను వినియోగించుకోవాలని వరంగల్ వన్ డిపో మేనేజర్ విజ్ఞప్తి చేశారు.