Politics

లోకేష్‌‌తో వంగవీటి రాధా భేటీ..

లోకేష్‌‌తో వంగవీటి రాధా  భేటీ..

అవును.. నిన్న, మొన్నటి వరకూ వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) పార్టీ మారుతున్నారని నెట్టింట్లో వార్తలు కోడై కూశాయి. ఇదిగో ఫలానా రోజున..

అవును.. నిన్న, మొన్నటి వరకూ వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha) పార్టీ మారుతున్నారని నెట్టింట్లో వార్తలు కోడై కూశాయి. ఇదిగో ఫలానా రోజున టీడీపీకి (Telugudesam) టాటా చెప్పేసి.. జనసేన (Janasena) తీర్థం పుచ్చుకుంటారని ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారని పెద్ద హడావుడే జరిగింది. సీన్ కట్ చేస్తే.. టీడీపీ యువనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘యువగళం పాదయాత్ర’లో (Yuvagalam Padayatra) మంగళవారం నాడు ప్రత్యక్షమయ్యారు. విజయవాడ (Vijayawada) నుంచి వచ్చిన రాధా.. యువనేతతో (Young Leader) కలిసి అడుగులో అడుగేశారు.. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. ఇద్దరూ ఇక అసలు విషయానికొచ్చేశారు. మధ్యాహ్నం భోజన విరామం సమయంలో లోకేష్‌తో క్యారవేన్‌లో (Nara Lokesh Caravan) వంగవీటి రాధా ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో భాగంగా పలు కీలక విషయాలు చర్చించారు. ముఖ్యంగా పార్టీ మార్పుపై సుమారు అరగంటకు పైగా ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే లోకేష్ ఏం మాట్లాడారు..? రాధా ఏం చెప్పారు..? అనేదానిపై ప్రత్యేక కథనం.

అసలేం జరిగింది..?

విజయవాడ మాస్ లీడర్.. వంగవీటి రంగా (Vangaveeti Ranga) కుమారుడు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ వైసీపీలో (YSR Congress) ఉన్న ఆయన.. విజయవాడ సెంట్రల్ (Vijayawada Central) ఆశించడం, వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) కుదరదని తేల్చిచెప్పడంతో బయటికొచ్చేసి టీడీపీ అధినేత చంద్రబాబు (TDP Chief Chandrababu) సమక్షంలో పసుపు కండువా కప్పుకున్నారు. అయితే.. ఆ ఎన్నికల్లో రాధాకు సీటు ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇస్తారని హామీ ఇచ్చారని ప్రచారం జరిగినప్పటికీ టీడీపీ అధికారంలోకి రాకపోవడంతో పరిస్థితులు అనుకూలించలేదు. రానున్న ఎన్నికల్లో అయినా సరే టికెట్ దక్కించుకొని గెలవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈయనకు కావాల్సింది విజయవాడ సెంట్రల్ సీటు మాత్రమే.. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ తరఫున టికెట్ వచ్చేలా లేదు. ఎందుకంటే సెంట్రల్ నుంచి టీడీపీ తరఫున బోండా ఉమామహేశ్వరరావు (Bonda Uma Maheswar Rao) గత ఎన్నికల్లో కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా సరే వైసీపీ తరఫున ఎవరు పోటీచేసినా సరే ఓడిస్తాననే ధీమాతో ఉన్నారు. ఇక సెంట్రల్ నుంచి టీడీపీ తరఫున పోటీచేసే ఛాన్స్ లేకపోవడంతో జనసేనలో చేరి.. పొత్తు కుదిరితే కచ్చితంగా ఆ స్థానం నుంచి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఒప్పించి మరీ టికెట్ తెచ్చుకోవాలని భావించారని నిన్న, మొన్నటి వరకూ వార్తలొచ్చాయి. అంతేకాదు.. జనసేన ఆవిర్భావ దినోత్సవం లేదా ఉగాది రోజున పవన్ సమక్షంలో రాధా కండువా కప్పుకుంటారనే విషయం.. విజయవాడ రాజకీయాల్లోకి పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయ్యింది.

సీన్ కట్ చేస్తే..!

అలా రూమర్స్ వచ్చిన రోజుల వ్యవధిలోనే లోకేష్ యువగళం పాదయాత్రలో రాధా ప్రత్యక్షమయ్యారు. ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో విజయవాడ నుంచి వచ్చిన రాధా.. పీలేరులో సాగుతున్న లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. దీంతో వంగవీటి వీరాభిమానులు (Vangaveeti Fans), కార్యకర్తలు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. హమ్మయ్యా.. కథ సుఖాంతం అయినట్లేనని, పార్టీ మారే పరిస్థితి ఇక ఉండదని వంగవీటి అనుచరులు ఆనందపడ్డారు. ఇక్కడి వరకూ అంతా ఓకే కానీ.. సీటు సంగతేంటి..? అనే ప్రశ్న అభిమానుల్లో ఇంకా మదిలో ఉంది. అయితే.. లోకేష్‌ క్యారవేన్‌‌లో రాధా ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గంటకుపైగా ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. ఈ సమావేశంలో పార్టీ మార్పు, సీటు విషయంపై చాలా స్పష్టంగా చర్చ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. భేటీలో లోకేష్ చెప్పాల్సింది చాలా క్లియర్‌ కట్‌గా చెప్పేశారట.

ఇక మీ ఇష్టం..!

‘ కచ్చితంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రాబోతోంది. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలా వద్దా అనేది చంద్రబాబుగారు నిర్ణయిస్తారు. టికెట్ వస్తే సరే లేకుంటే అధికారంలోకి రాగానే కచ్చితంగా మీకు ఉండాల్సిన ప్రాధాన్యత ఉంటుంది. పార్టీ మారే ఆలోచనను విరమించుకోండి. పార్టీ కోసం అందరూ కష్టపడదాం.. అధికారంలోకి తెచ్చుకుందాం.. ఆ తర్వాత మిగిలినవి ఆలోచిద్దాం. నేను చెప్పాల్సింది చెప్పాను.. ఇక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనేది మీ ఇష్టం’ అని రాధాతో ఫుల్ క్లారిటీతో లోకేష్ చేప్పేశారట. యువనేత చెప్పిన మాటలతో రాధా చాలా హ్యాపీగా ఫీలయ్యారట. అంటే.. వీలైతే రాధా అడిగిన అసెంబ్లీ టికెట్ ఇవ్వడం.. వీలుకాని పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్సీ (MLC) ఇచ్చి కీలక పదవి ఇవ్వాలన్నది టీడీపీ అధిష్టానం ఆలోచన అని కార్యకర్తలు అనుకుంటున్నారట. మరోవైపు.. క్యారవేన్ నుంచి నవ్వుతూ బయటికి రావడంతో లోకేష్ చర్చలు సక్సెస్ అయ్యాయని టీడీపీ కార్యకర్తలు, రాధా అనుచరులు ఆనందంలో మునిగి తేలుతున్నారట.

వారంలో రెండు సార్లు వస్తా..!

లోకేష్‌తో భేటీ తర్వాత ఇకపై వారంలో రెండు సార్లు యువనేత పాదయాత్రలో పాల్గొంటానని రాధా చెప్పారు. పాదయాత్రలో పాల్గొనడమే కాదు.. మరోసారి ఈ ఇద్దరి భేటీ ఉంటుందని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే.. పార్టీ మారే ఆలోచనను వంగవీటి విరమించకున్నట్లే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటే టీడీపీ-జనసేన పార్టీలు రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ మారకపోవడమే మంచిదని రాధాకు సీన్ అర్థమైనట్టేనని.. ఇక ఆయన ఆ ఆలోచనే చేయరని అనుచరులు చెప్పుకుంటున్నారట. రానున్న ఎన్నికల్లో ఏం జరుగుతుందో.. రాధా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే మరి.