NRI-NRT

కూచి సాయి శంకర్‌చే చిత్రకళపై నాట్స్ వెబినార్ ….

కూచి సాయి శంకర్‌చే చిత్రకళపై నాట్స్ వెబినార్ ….

జూన్ 12: అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా చిత్రం భళారే విచిత్రం పేరిట నాట్స్ అంతర్జాలంలో నాట్స్ వెబినార్ నిర్వహించింది. ప్రముఖ చిత్రకారుడు, ప్రపంచ రికార్డు గ్రహీత, నంది అవార్డు విజేత కూచి సాయి శంకర్ ఈ వెబినార్‌కి ముఖ్య అతిధిగా విచ్చేశారు. చిత్రకళ గొప్పదనాన్ని వివరించడంతో పాటు..అత్యంత వేగంగా ఎవరు ఏ అంశం మీద బొమ్మ అడిగిన వెంటనే వేసి అందరిని ఆశ్చర్యపరిచారు. అద్భుతమైన బొమ్మలు గీసి ఔరా అనిపించారు. అన్నమయ్య సాహిత్యం అందరికి అర్థమయ్యే విధంగా తాను గీసిన బొమ్మల గురించి వివరించారు. పద్యాలకు, పాటలకు ఒక్క బొమ్మతో అర్థం చేసుకునే విధంగా గీసిన బొమ్మలను చూపించారు. ఒకవైపు కిభశ్రీ పాట ఆలపిస్తుండగానే ఆ పాటకు తగ్గట్టుగా బొమ్మ వేసి అబ్బురపరిచారు. ఈ వెబినార్‌కు ప్రముఖ ప్రవాసాంధ్ర రచయిత కిభశ్రీ వ్యాఖ్యతగా వ్యవహరించారు. తెలుగువారి ప్రత్యేకమైన చిత్ర కళాశైళిని కూచి చక్కగా వివరించారు. నాట్స్ మీద క్షణాల్లో బొమ్మ గీసి చూపించారు. ఇంకా ఈ కార్యక్రమంలో నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు) నూతి నాట్స్ లలిత కళా వేదిక ద్వారా తెలుగు భాష కోసం.. తెలుగు కళల కోసం చేస్తున్న కృషిని తెలిపారు. ఈ వెబినార్‌ దిగ్విజయంగా జరపడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరిని నాట్స్ చైర్ విమెన్ అరుణ గంటి ప్రత్యేకంగా అభినందించారు.