Politics

టీఎంసీ ఎంపీపై చీటింగ్ కేసు

టీఎంసీ ఎంపీపై చీటింగ్ కేసు

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ, సినీ నటి నుస్రత్ జహాన్‌పై ఈడీకి ఫిర్యాదు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాలు జిల్లాలో ఆమె మోసానికి పాల్పడిందంటూ ఈడీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఆమె కేవలం రూ.6 లక్షలకే త్రిబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్‌ ఇస్తామని డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపించారు. ఆమె ప్రకటించిన ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తమకు త్రిబుల్ బెడ్ రూమ్‌ ఫ్లాట్స్ తక్కువ ధరకే అందిస్తామని మోసం చేశారంటూ సాల్ట్ లేక్ ఈడీ కార్యాలయంలో బాధితులు ఫిర్యాదు చేశారు. సెవెన్ సెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ పేరుతో మోసాలకు పాల్పడ్డారని వారు ఆరోపించారు.ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న నుస్రత్ జహాన్ దాదాపు రూ.24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఈ వ్యవహారంపై గతంలో కోర్టులో కేసు దాఖలైంది. ఈ కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ నుస్రత్ జహాన్ కోర్టుకు హాజరు కాలేదని బాధితులు తెలిపారు. దీంతో చివరికీ ఈడీని ఆశ్రయించామన్నారు. అయితే ఈ విషయంలో నుస్రత్‌ జహాన్ ఇప్పటివరకు స్పందించలేదు. కాగా.. నుస్రత్ జ‌హాన్‌ బెంగాలీ సినిమా ఇండస్ట్రీకి చెందిన నటి. ఆమె 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ తరపున బసిర్‌హాట్‌ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచింది. గతంలో ఫిబ్రవరి 2012లో పార్క్ స్ట్రీట్‌లో ఆంగ్లో-ఇండియన్ మహిళపై జరిగిన సామూహిక అత్యాచారం తర్వాత జహాన్ వివాదంలో చిక్కుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఖాదర్ ఖాన్‌కు ఆశ్రయం కల్పించినట్లు జహాన్‌పై ఆరోపణలు ఉన్నాయి. మార్చి 2015లో అత్యాచార బాధితురాలు మరణించింది. నిందితుడు ఖాదర్‌ ఖాన్ ఇంకా పరారీలో ఉన్నాడు.