* యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
సెల్ ఫోన్కు సమీపంలో నిద్రించడం వల్ల కలిగే ప్రమాదాలు, లోపాలను ఇప్పటికే అనేక అధ్యయనాలు వెల్లడించాయి. తాజాగా ఐఫోన్ల తయారీదారు ఆపిల్ కూడా స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు స్పష్టమైన సూచన చేసింది. ఫోన్ ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తులకు, ఛార్జింగ్ పెట్టిన ఫోన్ పక్కనే పెట్టుకునే వారికి హెచ్చరిక జారీ చేసింది. దాన్ని తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఈ నిబంధనల్లో ఐఫోన్లను బాగా వెలుతురు ఉన్న వాతావరణంలో, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరితలాలపై పెట్టి ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఛార్జింగ్ పెట్టవద్దని స్పష్టం చేసింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడిని సులభంగా విడుదల చేయలేనప్పుడు ఫోన్ కొంద ఉన్న భాగం కాలిపోవడం, తీవ్రమైన సందర్భాల్లో మంటలను రేకెత్తించే ప్రమాదం కలిగిస్తాయని తెలిపింది. ఫోన్ ను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు ఆ పరికరం, పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్పై నిద్రించవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్కి కనెక్ట్ చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచవద్దని స్పష్టం చేసింది. దెబ్బతిన్న కేబుల్స్, ఛార్జర్లను ఉపయోగించవద్దని, తేమ ఉన్నప్పుడు ఛార్జింగ్ చేయకూడదని కూడా సలహా ఇచ్చింది.
* ముకేశ్ అంబానీ కొత్త కంపెనీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరొక అనుబంధ సంస్థ అయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ముంబైలో పెద్ద ఆఫీస్ స్థలాన్ని లీజుకు తీసుకుంది. డేటా అనలిటిక్స్ ప్లాట్ఫారమ్ ప్రోప్స్టాక్ అందుబాటులో ఉంచిన డాకుమెంట్స్ ప్రకారం లీజు మొత్తం 60 నెలలు.ముఖేష్ అంబానీ నేతృత్వంలోని జియో ఫైనాన్షియల్ చెల్లించిన అద్దె వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. దీని ప్రకారం అద్దె మొత్తం లక్షల్లో ఉండగా.ఈ ఆఫీస్ బాంద్రా కుర్లా క్యాంపస్లోని మేకర్ మాక్సిటీ మొదటి అంతస్తులో ఉంది. ఈ ప్రాంతంలో NSE ఆండ్ SEBI ఆఫీసులు కూడా ఉన్నాయి. ఆర్థిక రాజధానిలో సందడిగా ఉండే ఈ ప్రాంతంలో అనేక ప్రముఖ బ్యాంకులు కూడా ఉన్నాయి.ఆసియాలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ కొత్త వెంచర్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ దాని మాతృ సంస్థలో సుమారు రూ. 1 లక్ష కోట్ల విలువైన 6.1 శాతం వాటా ఉంది.మొదటి మూడు సంవత్సరాలకి Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీస్ రెంట్ నెలకు 55.50 లక్షలు. మిగిలిన రెండేళ్లకి ప్రతినెలా అద్దె రూ.63.81 లక్షలు.గతంలో రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ అని పిలిచే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్, ముంబైలో 13,872 చదరపు అడుగుల స్థలాన్ని ప్రతినెలా అద్దె రూ.55.50 లక్షలతో లీజుకు తీసుకుంది .Jio ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆఫీస్ కోసం 83.23 లక్షలు డిపాజిట్ అలాగే ఏడు కార్ పార్కింగ్ కోసం స్థలాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం ఈ కంపెనీ విస్తరణ మోడ్లో ఉందని, భవిష్యత్తులో మరిన్ని ఆఫీస్ స్పేస్ తీసుకోనున్నట్లు తెలిపారు.FY23 అన్యువల్ రిపోర్ట్ లో కంపెనీ భారతీయులకు ‘సరసమైన, డిజిటల్-ఫస్ట్’ ఆర్థిక పరిష్కారాలను అందిస్తుందని ముకేశ్ అంబానీ చెప్పారు.
* తక్కువ పెట్టుబడితో బెస్ట్ బిజినెస్ ఐడియా
ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో కనీస ప్రారంభ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించాలని అందరూ అనుకుంటూ ఉంటారు. తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఒకవేళ నష్టపోయినా పెద్దగా ఇబ్బంది ఉండదని నేటి యువత ఆలోచన. ఈ రోజుల్లో ప్రపంచం మొత్తం డిజిటల్ వైపు పరుగులు తీస్తుంది. దీని ఫలితంగా ఆన్లైన్ కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయి. పర్యవసానంగా ల్యాప్టాప్లు, స్మార్ట్ఫోన్లను యువత అధికంగా వినియోగిస్తున్నారు. వినియోగం ఎక్కువగా ఉందంటే సమస్యలు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ఎలక్ట్రానిక్ పరికరాల పాడైపోయే స్వభావం కారణంగా అవి కాలక్రమేణా పనిచేయవు. కాబట్టి సుశిక్షితులైన సాంకేతిక నిపుణులతో కూడిన ప్రత్యేక మరమ్మతు కేంద్రాలను సందర్శించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో తక్కువ పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించాలనుకునేవారు రిపేర్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తే మంచి ఆదాయ వనరుగా మారుతుంది. తక్కువ పెట్టుబడితో నెలకు వేల రూపాయాల టర్నోవర్ను సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు మార్కెట్లో ఉండే ధరల కంటే తక్కువ ధరల్లో రిపేర్ చేస్తే మెండుగా లభిస్తుంది. ఈ నేపథ్యంలో రిపేర్ కేంద్రాన్ని ప్రారంభిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో? ఓ సారి తెలుసుకుందాం. ల్యాప్టాప్ రిపేర్ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు దీని గురించి మొత్తం సమాచారాన్ని కలిగి ఉండాలి. దీని కోసం ల్యాప్టాప్లు, మొబైల్లను రిపేర్ చేయడానికి శిక్షణా సెషన్లు తీసుకోవచ్చు. అయితే ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్లడం మంచిది. ఈ కోర్సు చేసిన తర్వాత కొంతకాలం మరమ్మతు కేంద్రంలో పని చేస్తే అది మీకు మంచిది. సాంకేతిక అంశాలను నేర్చుకున్న తర్వాత అటువంటి సేవల్లో పరిమిత పోటీతో సౌకర్యవంతంగా అందుబాటులో ఉండే ప్రదేశంలో ల్యాప్టాప్, మొబైల్ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేయవచ్చు. వేగవంతమైన వ్యాపార విస్తరణకు భరోసానిస్తూ మీ కేంద్రాన్ని విస్తృతంగా ప్రచారం చేయడానికి సోషల్ మీడియాను ఉపయోగించడం మేలు. మీ ల్యాప్టాప్, మొబైల్ రిపేర్ షాప్ను ప్రారంభించే ప్రారంభ దశలో మీకు విస్తృతమైన ఇన్వెంటరీ అవసరం లేదు. మదర్బోర్డులు, ప్రాసెసర్లు, ర్యామ్, హార్డ్ డ్రైవ్లు, సౌండ్ కార్డ్లు వంటి ముఖ్యమైన హార్డ్వేర్ భాగాలను పెద్ద పరిమాణంలో నిల్వ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాటిని అవసరమైనంత మేర ఆర్డర్ చేసుకోవచ్చు.ల్యాప్టాప్, మొబైల్ రిపేరింగ్ వ్యాపారాన్ని అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు. ప్రారంభంలో వ్యాపారాన్ని రూ. 30,000 నుంచి 50,000 వరకు నిరాడంబరమైన మొత్తంతో ప్రారంభించవచ్చు. వ్యాపారం వృద్ధి చెందుతున్నప్పుడు దాని వృద్ధికి అనుగుణంగా అదనపు పెట్టుబడులను పెట్టడం ఉత్తమం. ప్రస్తుతం మొబైల్, ల్యాప్టాప్ మరమ్మతు సేవలకు ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ రంగంలో లాభదాయకమైన అవకాశాన్ని అందిస్తున్నారని గమనించాలి. ఈ పరిస్థితుల్లో ఈ వ్యాపారం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా కంపెనీలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకుంటే అదనపు ఆదాయం లభిస్తుంది.
* పెరిగిన బంగారం ధరలు
ప్రస్తుతం పెళ్లీళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉన్నాయి. అయితే చాలా మంది ఇంట్లో చిన్న శుభకార్యం అయినా సరే పసిడిని కొనేందుకు ఎక్కువ మక్కువ చూపుతుంటారు. కానీ గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతూ ప్రజలకు షాకిస్తున్నాయి. నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.హైదరాబాద్ బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం ధర: రూ. 54,200 ,24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59,130.విజయవాడలో బంగారం ధరలు:22 క్యారెట్ల బంగారం రేటు: రూ. 54, 200, 24 క్యారెట్ల బంగారం ధర: రూ. 59,130
* IPO లిస్టింగ్ లో స్వల్ప లాభాలే
TVS సప్లై చైన్ సొల్యూషన్స్ (TVS SCS) షేర్లు బుధవారం, ఆగస్టు 23న స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యాయి. కంపెనీ షేర్లు BSEలో రూ. 206.3 వద్ద లిస్ట్ అయ్యాయి. దాని IPO ఇష్యూ ధర కంటే రూ. 9.3, 4.7 శాతం ఎక్కువగా లిస్ట్ అయ్యింది. TVS సప్లై చైన్ స్టాక్ నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ NSEలో రూ. 10.1, 5.1 శాతం ప్రీమియంతో రూ. 207.1 వద్ద లిస్ట్ అయ్యింది. ఇంటిగ్రేటెడ్ సప్లయ్ చైన్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన TVS సప్లై చైన్ సొల్యూషన్స్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (TVS సప్లై చైన్ IPO) ఆగస్టు 10, 2023న సబ్స్క్రిప్షన్ కోసం తెరుచుకుంది. IPO మొత్తం 2.85 రెట్లు సబ్స్క్రైబ్ చేయబడింది. అయితే, ఇటీవలి కాలంలో కొన్ని IPOలు అందుకున్న సబ్స్క్రిప్షన్తో పోలిస్తే స్పందన తక్కువగా ఉంది. అదే సమయంలో, నేటి వ్యాపారం ప్రారంభానికి ముందు, TVS సప్లై చైన్ షేరు గ్రే మార్కెట్లో రూ. 4 ప్రీమియంతో అందుబాటులో ఉండగా, కంపెనీ షేరు 4.7 శాతం ప్రీమియంతో జాబితా చేయబడింది.TVS సప్లై చైన్ సొల్యూషన్స్ IPO ధరను ఒక్కో షేరుకు రూ.187 నుండి రూ.197గా నిర్ణయించింది. మొత్తం ఇష్యూ పరిమాణం రూ. 880 కోట్లు. ఇందులో రూ.600 కోట్లు తాజా షేర్లు కాగా, 1.42 కోట్ల ఈక్విటీ షేర్లకు ఆఫర్ ఫర్ సేల్కు అవకాశం ఉంది.కొత్త షేరు ద్వారా వచ్చిన మొత్తాన్ని తన అనుబంధ సంస్థలైన టీవీఎస్ ఎల్ఐ యూకే, టీవీఎస్ ఎస్సీఎస్ సింగపూర్ రుణాన్ని తిరిగి చెల్లించేందుకు ఉపయోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ముగింపు నాటికి మొత్తం రుణాలు రూ.1,989 కోట్లుగా ఉన్నాయి.
* రియల్ మీ 5జీ నుంచి 2 స్మార్ట్ఫోన్లు
చైనాకు చెందిన మొబైల్ తయారీ కంపెనీ రియల్మీ (Realme) కొత్తగా రెండు 5జీ స్మార్ట్ఫోన్లను భారత్లో లాంచ్ చేసింది. రియల్మీ 11 5జీ (Realme 11 5G), రియల్మీ 11X 5జీ (Realme 11X 5G) పేరిట ఈ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్లూ మీడియాటెక్ డైమన్సిటీ 6,100+ ప్రాసెసర్తో పనిచేస్తాయి. కాకపోతే ఇతర స్పెసిఫికేషన్లలో కంపెనీ మార్పులు చేసింది. ఇదే ఈవెంట్లో ఈ రెండు ఫోన్లతో పాటు రియల్మీ బడ్స్ ఎయిర్ 5, రియల్మీ బడ్స్ ఎయిర్ 5 ప్రో పేరిట రెండు ట్రూ వైర్లెస్ స్టీరియో ఇయర్ఫోన్స్ను లాంచ్ చేసింది.రియల్మీ 11 5జీ రెండు వేరియంట్లలో వస్తోంది. 8జీబీ ర్యామ్+128జీబీ వేరియంట్ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ.19,999గా పేర్కొంది. గ్లోరీ గోల్డ్, గ్లోరీ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 29 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఇక రియల్మీ 11 ఎక్స్ 5జీ ఫోన్ 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.14,999గానూ, 6జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ.15,999గానూ కంపెనీ నిర్ణయించింది. మిడ్నైట్ బ్లాక్, పర్పుల్ డాన్ రంగుల్లో లభిస్తుంది. ఆగస్టు 30 నుంచి విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు ఫోన్లూ ఫ్లిప్కార్ట్, రియల్మీ.కామ్ వెబ్సైట్, ప్రధాన రిటైల్ స్టోర్లలో లభిస్తాయని కంపెనీ పేర్కొంది. ప్రారంభ ఆఫర్ కింద ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులతో కొనుగోళ్లపై రూ.1,500 డిస్కౌంట్ అందిస్తున్నారు.రియల్మీ 11 5జీ ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్మీ యూఐ 4.0తో పనిచేస్తుంది. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్డీ శాంసంగ్ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. 120Hz రిఫ్రెష్ రేటుతో వస్తోంది. డైనమిక్ ర్యామ్ ఎక్స్పాన్షన్ సదుపాయం కూడా ఉంది. దీంతో 16జీబీ వరకు ర్యామ్ పెంచుకోవచ్చు. వెనుకవైపు 108 మెగాపిక్సల్ సెన్సర్ అమర్చారు. సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, యూఎస్బీ టైప్-సి పోర్ట్ ఇస్తున్నారు. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 67W సూపర్వూక్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 17 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీని ఛార్జీ చేయొచ్చని కంపెనీ పేర్కొంది.రియల్మీ 11ఎక్స్ సైతం ఆండ్రాయిడ్ 13తో కూడిన రియల్మీ యూఐ 4.0తో వస్తోంది. 6.72 అంగుళాల ఫుల్హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే ఇస్తున్నారు. ఇందులోనూ డైనమిక్ ర్యామ్ సదుపాయం ఉంది. వెనుకవైపు 64 ఎంపీ కెమెరా ఇస్తున్నారు. సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. 33W సూపర్వూక్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
* బ్రైట్కామ్ గ్రూప్పై సెబీ కొరడా
ఆగస్ట్ 22న బ్రైట్కామ్ షేర్ల విక్రయాన్ని నిషేధిస్తూ రెగ్యులేటర్ సెబీ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్డర్ తర్వాత ఇన్వెస్టర్ శంకర్ శర్మతో సహా 23 మంది బ్రైట్కామ్ గ్రూప్ షేర్లను విక్రయించలేరు. బ్రైట్కామ్ గ్రూప్ ప్రిఫరెన్షియల్ షేర్లను పరిశీలించిన తర్వాత సెబీ ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దర్యాప్తులో భాగంగా బ్రైట్కామ్ గ్రూప్ ప్రిఫరెన్షియల్ షేర్ల కేటాయింపులో అవకతవకలు జరిగినట్లు సెబీ గుర్తించింది. దీనితో పాటు, బ్రైట్కామ్ గ్రూప్ డబ్బును మళ్లించడానికి కేటాయించిన వారి నుండి షేర్ దరఖాస్తు డబ్బుకు నకిలీ రసీదులు తీసుకున్నట్లు కూడా తేలింది.బ్రైట్కామ్ ఎండి, ఛైర్మన్ సురేష్ కుమార్ రెడ్డి, దాని సిఎఫ్ఓ నారాయణ రాజు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లిస్టెడ్ కంపెనీ లేదా దాని అనుబంధ సంస్థలో డైరెక్టర్ లేదా మేనేజర్ స్థాయి పదవిని నిర్వహించకుండా మార్కెట్స్ రెగ్యులేటర్ సెబి నిషేధించింది. దీంతో పాటు కంపెనీ షేర్లను విక్రయించకుండా సురేష్ కుమార్ రెడ్డిపై నిషేధం విధించింది. SEBI, దాని మధ్యంతర ఉత్తర్వులో, ఆడిటర్ కంపెనీ P. మురళి & కో. PCN & అసోసియేట్లతో సహా వారి కొత్త లేదా మాజీ భాగస్వాములు బ్రైట్కామ్ లేదా దాని అనుబంధ సంస్థలు సైతం కంపెనీకి ఎలాంటి సేవలు అందించకూడదు. బ్రైట్కామ్ గ్రూప్ ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రకారం కోట్లాది రూపాయలను సమీకరించింది. ఆ మొత్తం కంపెనీకి అందలేదు. 22 మందికి 25.76 కోట్ల షేర్లు కేటాయించారు. కేటాయింపు రేటు ప్రకారం రూ.245.24 కోట్లు రావాల్సి ఉంది. కానీ కంపెనీ ఆదాయం రూ.52.51 కోట్లు మాత్రమే ఉంది. కానీ రూ.192.73 కోట్లు కంపెనీకి రాలేదు.కంపెనీల అవకతవకలు జరిగినట్లు సెబీ గుర్తించింది. షేర్ల రూపంలో కంపెనీకి రావాల్సిన డబ్బు, మరొక మార్గంలో తిరిగి వెళ్ళింది. పెట్టుబడిదారుల నుంచి ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మార్కెట్ రెగ్యులేటర్కు ఫిర్యాదులు అందాయి. అంతేకాదు సెబీకి ప్రస్తుతం బ్రైట్ కామ్ గ్రూపు తప్పుదోవ పట్టించేలా బ్యాంకు స్టేట్మెంట్లను సైతం తప్పుడు మార్గంలో సమర్పించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన నివేదికలు కూడా తప్పుడు మార్గంలోనే అవకతవకల్లో అందించినట్లు షఫీ అనుమానిస్తోంది కంపెనీ యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయింది. జూలైలో సెబీని తప్పుదారి పట్టించడానికి కంపెనీ ఫోర్జరీ బ్యాంకు డాక్యుమెంట్లను సమర్పించినట్లు సెబీ తెలిపింది.
* టెక్నో పోవా 5 ప్రో
యువతను ఆకట్టుకునేలా అందుబాటు ధరలో కొత్త మొబైల్ ఫోను పోవా 5 తీసుకొచ్చినట్లు టెక్నో వెల్లడించింది. ఫోను వెనక భాగంలో 3డీ డిజైనింగ్తో, లైటింగ్ ఏర్పాటు ఉందని పేర్కొంది. 68 వాట్ల అల్ట్రా-ఫాస్ట్ ఛార్జింగ్తో 15 నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ ఛార్జింగ్ చేసుకోవచ్చు. మొబైల్ను ఉపయోగిస్తున్నప్పుడూ ఛార్జింగ్ చేసుకున్నా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సరికొత్త సాంకేతికత ఇందులో ఉన్నట్లు టెక్నో వెల్లడించింది. మొత్తం మూడు మోడళ్లలో ఇది లభిస్తుంది. 8జీబీ+128 జీబీతో పోవా 5 ధర రూ.11,999గా ఉంది. 8జీబీ+256జీబీ పోవా 5 ప్రో 5జీ ధర రూ.15,999 ఉండగా, 8జీబీ+128జీబీ పోవా 5 ప్రో 5జీ ధర రూ.14,999గా ఉంది. భారతీయ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోనును తీసుకొచ్చినట్లు టెక్నో మొబైల్స్ ఇండియా సీఈఓ అర్జీత్ తాళపత్ర తెలిపారు.
* స్కోడా ఆటో ఇండియా ఎక్స్చేంజ్ కార్నివాల్
స్కోడా ఆటో ఇండియా ఎక్స్చేంజ్ కార్నివాల్ను ప్రారంభించింది. ఇందులో కస్టమర్ -ఫ్రెండ్లీ డీల్లు, డిస్కౌంట్లు, సర్వీస్, మెయింటెనెన్స్, వారంటీ ప్యాకేజీలు ఉన్నాయి. తమ పాత కార్లతో స్కోడా కార్లను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు తగిన విలువను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని కంపెనీ తెలిపింది. ఎక్స్ఛేంజ్ కార్నివాల్ కింద, స్కోడా ఆటో ఇండియా రూ. 60 వేల వరకు ప్రయోజనాలను, రూ. 70,000 వరకు కార్పొరేట్ ప్రయోజనాలను అందిస్తోంది.