Business

యాపిల్‌పై గెలిచిన బెంగుళూరు యువకుడు

యాపిల్‌పై గెలిచిన బెంగుళూరు యువకుడు

బెంగళూరులోని ఫ్రేజర్ టౌన్ నివాసి ‘అవెజ్ ఖాన్’ ఆపిల్ ఇండియా సర్వీస్ సెంటర్ నుంచి లక్ష రూపాయల నష్టపరిహారాన్ని పొందినట్లు తెలుస్తోంది. అతని ఐఫోన్ 13 మొబైల్‌కి జరిగిన నష్టం కారణంగా ఈ పరిహారం వచ్చింది. 2021 అక్టోబర్ నెలలో ఐఫోన్ 13 మొబైల్‌ను ఒక సంవత్సరం వారంటీతో కొనుగోలు చేసాడు. ఆ తరువాత కొన్ని నెలలకు బ్యాటరీ, స్పీకర్ రెండింటిలోనూ సమస్య ఏర్పడింది. దీంతో 2022 ఆగస్టులో ఇందిరానగర్ సర్వీస్ సెంటర్‌ సందర్శించి సమస్య తెలిపాడు. అక్కడి వారు ప్రాబ్లమ్ త్వరలోనే పరిష్కారమవుతుందని, వారం రోజుల్లో మీకు ఫోన్ చేస్తామని తెలిపారు.

కొన్ని రోజుల తరువాత మొబైల్ ప్రాబ్లమ్ క్లియర్ అయిందని సర్వీస్ సెంటర్ నుంచి కాల్ వచ్చింది. ఆ తరువాత కూడా అదే సమస్య ఉన్నట్లు మళ్ళీ సర్వీస్ సెంటర్‌లో ఫిర్యాదు చేశాడు. మళ్ళీ ఈ సమస్య క్లియర్ చేస్తామని చెప్పిన సర్వీస్ సెంటర్‌ రెండు వారాలైనా స్పందించలేదు. మొబైల్ మెష్‌పై జిగురు లాంటి పదార్ధం కనిపించినట్లు తెలిపారు. ఈ సమస్య ఒక సంవత్సరం వారంటీ కింద కవర్ చేయరని తెలిపారు. దీంతో ఖాన్.. ఆపిల్ ప్రతినిధులకు చాలా ఇమెయిల్‌లు పంపించాడు, కానీ దానికి ఎలాంటి రిప్లై రాలేదు. విసిగిపోయిన కస్టమర్ లీగల్ నోటీసు పంపాడు, దానికి కూడా ఎటువంటి సమాధానం రాలేదు. గత డిసెంబర్ నెలలో స్థానిక జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ కేసుని విచారించిన కమిషన్ అతనికి వడ్డీతో కలిపి రూ. 79,900 నష్టపరిహారం, అతడు పడిన కష్టానికి అదనంగా రూ. 20,000 చెల్లించాలని యాపిల్ కంపెనీని ఆదేశించినట్లు సమాచారం.