Business

దసరాకు TSRTC ప్రత్యేక తాయిలాలు

దసరాకు TSRTC ప్రత్యేక తాయిలాలు

దసరా, బతుకమ్మ పండుగలకు ఊరెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ(TSRTC) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలను చేర్చేందుకు వీలుగా 5,265 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ప్లాన్‌ చేసినట్టు టీఎస్‌ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో ఓ పోస్ట్‌ పెట్టారు. అక్టోబర్ 13 నుంచి 25వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. గతేడాది కన్నా 1000 బస్సులను అదనంగా నడపనున్నారు. ఈ ప్రత్యేక బస్సుల్లో 536 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించారు. అక్టోబర్ 22న సద్దుల బతుకమ్మ, 23న మహర్నవమి 24న దసరాకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో .. ఆయా రోజుల్లో అవసరాన్ని బట్టి మరిన్ని ప్రత్యేక బస్సులను నడపనున్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు ప్రత్యేక బస్సులు నడుస్తాయని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తెలిపారు.

మరోవైపు, ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీలనే సంస్థ వసూలు చేయనున్నట్టు సజ్జనార్‌ స్పష్టంచేశారు. స్పెషల్ సర్వీసులకు ఒక్క రూపాయి కూడా అదనంగా వసూలు చేయడం లేదన్నారు. హైదరాబాద్‌లో ప్రధాన బస్టాండ్‌లైన ఎంజీబీఎస్, జేబీఎస్‌లతో పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండే కేపీహెచ్‌బీ కాలనీ, ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్, దిల్ సుఖ్ నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను నడిపించనుంది. పండుగ రోజుల్లో ఎంజీబీఎస్-ఉప్పల్, ఎంజీబీఎస్-జేబీఎస్, ఎంజీబీఎస్-ఎల్బీనగర్ మార్గాల్లో ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సును అందుబాటులో ఉంచనుంది. ‘‘అక్టోబర్ 21 నుంచి 23 వరకు ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెగ్యులర్, స్పెషల్ సర్వీసులను ఎంబీజీఎస్ నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి నడపాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయించింది. ఏపీలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపునకు వెళ్లే బస్సులు సీబీఎస్ నుంచి బయలుదేరుతాయి. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులు జేబీఎస్, పికెట్ నుంచి వెళ్తాయి. వరంగల్, హన్మకొండ, జనగామ, పరకాల, నర్సంపేట, మహబుబాబాద్, తొర్రూరు, యాదగిరిగుట్ట బస్సులు ఉప్పల్ క్రాస్ రోడ్స్, ఉప్పల్ బస్టాండ్ నుంచి నడుస్తాయి. విజయవాడ, విజయనగరం, గుంటూరు, విశాఖపట్నం బస్సులు ఎల్బీనగర్ నుంచి బయలుదేరుతాయి. మిగతా సర్వీసులు యథావిధిగా ఎంజీబీఎస్ నుంచే నడుస్తాయి. రెగ్యులర్ సర్వీసుల మాదిరిగానే ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంది. ఈ ప్రత్యేక సర్వీసులను ఉపయోగించుకుని క్షేమంగా, సురక్షితంగా ప్రయాణికులకు గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభుత్వ రంగ సంస్థైన టీఎస్ఆర్టీసీ కోరుతోంది” అని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక సర్వీసుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను తమ సంస్థ అధికారిక వెబ్‌సైట్‌ http://tsrtconline.inలో చేసుకోవచ్చన్నారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం టీఎస్‌ ఆర్టీసీ కాల్‌ సెంటర్‌ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని సజ్జనార్‌ సూచించారు.