Politics

ఓటుకు నోటు కేసు…రేవంత్‌కు సుప్రీంలో చుక్కెదురు

ఓటుకు నోటు కేసు…రేవంత్‌కు సుప్రీంలో చుక్కెదురు

ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు(మంగళవారం) విచారణ చేపట్టింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో హైకోర్టు కొట్టేయడంతో రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా డిస్మిస్‌ చేయడంతో రేవంత్‌రెడ్డికి మరోసారి భంగపాటు తప్పలేదు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి స్వయంగా స్టీఫెన్‌సన్‌ ఇంటికి వెళ్లి భారీ మొత్తంలో నగదుతో ప్రలోభాలకు గురిచేసిన వీడియో గతంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో నేడు సుప్రీంలో విచారణకు వచ్చింది.