ScienceAndTech

ఐఐటీ బాంబేలో మాంసం కూర గొడవలు

ఐఐటీ బాంబేలో మాంసం కూర గొడవలు

ఐఐటీ బాంబేలో కొద్ది నెలల క్రితం వెజ్‌-నాన్‌వెజ్‌ వివాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో నిరసన తెలిపిన విద్యార్థుల్లో ఒకరికి ఇనిస్టిట్యూట్‌ మెస్‌ కౌన్సిల్ 10 వేల రూపాయల జరిమానా విధించింది. దీంతోపాటుగా నిరసనల్లో పాల్గొన్నటువంటి ఇతర విద్యార్థులను సైతం గుర్తించేందుకు దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. అయితే అక్టోబరు 1న సమావేశమైన ఇనిస్టిట్యూట్ మెస్ కౌన్సిల్ వెజ్‌ తినే విద్యార్థుల కోసం ప్రత్యేకంగా టేబుళ్లను ఏర్పాటుచేయాలని నిర్ణయం తీసుకుంది. అలాగే, గతంలో కూడా వెజ్‌ పోస్టర్లకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిపైన చర్యలు చేపట్టాలని తీర్మానం చేసింది. అలాగే ఇదే విషయాన్ని విద్యార్థులకు కూడా ఈ-మెయిల్‌ ద్వారా తెలియజేసింది. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితం హాస్టల్‌ 12, 13, 14 లోని కొందరు విద్యార్థులు క్యాంపస్‌లో శాంతియుతంగా ఉన్నటువంటి వాతావరణానికి భంగం కలిగించడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు వ్యవహరించిన తీరు విద్యార్థి వ్యవహారాల విభాగం అసోసియేట్ డీన్‌ సూచించినటువంంటి నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఇలాంటి వారిని ఇనిస్టిట్యూట్‌ ప్రోత్సహించదని.. ఈ చర్యలకు పాల్పడిన విద్యార్థులపై వారిపై తగిన చర్యలు తీసుకుంటామని విద్యార్థులకు పంపిన ఈ-మెయిల్‌లో స్పష్టం చేసింది. అలాగే భోజన సమయంలో కొందరు నాన్‌-వెజ్‌ వాసనను ఇష్టపడరని.. హాస్టల్‌లో ఉండే ప్రతి విద్యార్థికి భోజన సమయంలో అసౌకర్యం కలగకుండా చూడటమే ఇనిస్టిట్యూట్‌ లక్ష్యమని తెలిపింది. అందుకే మెస్‌లో ఉన్న ఆరు టేబుళ్లను వెజిటేరియన్లకు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. అలాగే ఇక నుంచి ఆ టేబుళ్లలో వెజ్‌ భోజనం మాత్రమే చేయాలని విద్యార్థులకు పంపిన ఈ-మెయిల్‌లో పేర్కొంది. ఇదిలా ఉండగా.. వాస్తవానికి ఈ ఏడాది జులై నెలలో ఐఐటీ బాంబేలో వెజ్‌-నాన్‌వెజ్‌ వివాదం తీవ్ర దుమారం రేపింది. వసతి గృహం క్యాంటీన్‌లో నాన్‌వెజ్ తిన్నందుకు ఓ విద్యార్థిని మరో విద్యార్థి అవమానించాడు. దీంతో నాన్‌వెజ్ తినే విద్యార్థులపై క్యాంటీన్‌లో వివక్ష చూపుతున్నారని పలువురు విద్యార్థులు ఆందోళన చేశారు. అలాగే క్యాంటీన్‌ గోడలపై ‘వెజిటేరియన్లు మాత్రమే ఇక్కడ కూర్చోవడానికి అనుమతిస్తామని’ రాసినటువంటి పోస్టర్లను కొందరు విద్యార్థులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.