Health

పేపర్ లో పెట్టిన ఆహారం తింటున్నారా?

పేపర్ లో పెట్టిన ఆహారం తింటున్నారా?

బయట మనం సమోసాలు, మిర్చిబజ్జీలు, చకోడీలు, పకోడీలు, పల్లీలు లాంటివి కొన్నప్పుడు వాటిని న్యూస్‌పేపర్లో చుట్టి ఇస్తారు. వేడివేడి అయినా సరే ఇలానే ఇస్తారు. మనం తింటాం. కానీ ఈ మధ్య జరిగిన కొన్ని అధ్యయనాలు… చాలా విషయాలను చెప్తున్నాయి. మొన్నటికిమొన్న బ్లాక్‌ బాక్స్‌లో పెట్టే ఆహారం తినకూడదు అని చెప్పారు. ఇప్పుడు న్యూస్‌పేపర్లో చుట్టిన ఆహారాన్ని తినకూడదు అంటున్నారు.

ఇది ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుందని వైద్యులు అంటున్నారు. చాలా మంది వార్తాపత్రికలలోని ఆహారాన్ని తింటారు, ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. నిజానికి వార్తాపత్రికలపై వేడి ఆహారాన్ని ఉంచినప్పుడల్లా, కాగితంపై ఉన్న సిరా వేడి కారణంగా కరిగిపోతుందట. ఇది ఆరోగ్యానికి దెబ్బతీస్తుందట.

వార్తాపత్రిక సిరాలో డైసోప్రొపైల్ థాలేట్, డైన్ ఐసోప్రొపైలేట్ మొదలైన రసాయనాలను ఉపయోగిస్తారు. వేడి ఆహారం దీనికి తగిలినప్పుడల్లా ఇది కరుగుతుంది. అది మీ పొట్టలోకే వెళ్తుంది. ఇది క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కూడా దారి తీస్తుంది. ఇది పిల్లల మేధో వికాసాన్ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి వార్తాపత్రికలలో వేడి ఆహారాన్ని తినకూడదు. కేవలం న్యూస్‌ పేపర్స్‌ మాత్రమే కాదు.. పేపర్‌ కప్‌లో ఇచ్చే ఛాయ్‌ కూడా తాగకూడదట. దీని వల్ల పురుషులకు స్పెర్మ్‌ కౌంట్‌ పడిపోతుందని, ఇది కూడా పలు రకాల క్యాన్సర్‌కు దారితీస్తుందని అధ్యయనాలు ఎప్పుడో చెప్పాయి. కాబట్టి బయటు ఏదైనా తినేప్పుడు, తాగేప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

ఏదో ఒక దాంట్లో పెట్టేరుగా అని లాగించేస్తే.. మొదటికే మోసం వస్తుంది. డబ్బులు పెట్టి అనారోగ్యాన్ని కొనుక్కోవడమే.. బయట ఆహారాలు తినడం. వీకెండ్స్‌ వస్తే..బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్లు, న్యూడిల్స్‌, ఫ్రైడ్‌రైస్‌లు అని ఏది పడితే అది తిని.. ఊబకాయాని గేట్లు ఎత్తుతున్నారు. ఒక్కసారి బరువు పెరగారంటే.. ఆ తర్వాత తగ్గడం మీ చేతుల్లో ఉండదు. ఎంతో కష్టపడితే కానీ.. తిరిగి మాములు స్థితికి వస్తారు. ఈలోపే ఎన్నో రోగాలు. అవసరమా ఇవన్నీ..! ముందు నుంచే తినేవాటిని, తాగేవాటిని కంట్రోల్లో ఉంచుకోవడం అన్నివిధాల ఉత్తమం.