వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణపై ఫోకస్ చేయలేమని.. ఈ విషయాన్ని రాష్ట్ర నేతలకు వివరించాలని ములాఖత్లో భాగంగా శనివారం టీటీడీపీ చీఫ్ కాసాని జ్ఞానేశ్వర్కు చెప్పారు. చంద్రబాబు ఆదేశాల మేరకు కాసాని జ్ఞానేశ్వర్ తెలంగాణ టీడీపీ నేతలతో హైదరాబాద్లో ఇవాళ భేటీ అయ్యారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి అధిష్టానం నిరాకరించిందన్న విషయాన్ని ఈ సందర్భంగా కాసాని నేతలకు వివరించారు.పోటీ వద్దన్న హై కమాండ్ నిర్ణయంతో తీవ్ర నిరాశకు గురైన కాసాని కార్యకర్తలతో భేటీ సందర్భంగా కంటతడి పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే, తెలంగాణలో పోటీ వద్దన్న అధిష్టాన నిర్ణయంపై తెలంగాణ టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కాసానితో భేటీ సందర్భంగా హైకమాండ్ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని రాష్ట్ర తెలుగు దేశం నేతలు పట్టుబట్టారు. దీంతో పోటీ విషయంపై నేతల అభిప్రాయాన్ని మరోసారి పార్టీ హై కమాండ్ దృష్టికి తీసుకెళ్తానని కాసాని నేతలకు హామీ ఇచ్చారు.
కాగా, తెలంగాణ టీడీపీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన కాసాని రాష్ట్రంలో టీడీపీ పూర్వ వైభవం కోసం తీవ్రంగా కృషి చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు టీడీపీ ఆశావహుల నుండి టికెట్ల దరఖాస్తులు సైతం స్వీకరించారు. 300కు పైగా ఆశావహులు టికెట్ కోసం అప్లికేషన్ సైతం పెట్టుకున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో పోటీ వద్దని హై కమాండ్ నిర్ణయించడంతో నేతలు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు.
👉 – Please join our whatsapp channel here –