సూర్యుడిని అధ్యయనం చేసేందుకు ఉద్దేశించిన ‘ఆదిత్య ఎల్1 (Aditya L1)’ తన ప్రయాణంలో చివరి దశకు చేరుకుంటోంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఉపగ్రహాన్ని ఎల్1 పాయింట్ (L1 Point)లో ప్రవేశపెట్టేందుకు నిర్వహించాల్సిన విన్యాసాలు వచ్చే ఏడాది జనవరి 7వ తేదీ నాటికి పూర్తవుతాయని తెలిపారు. భారత్ నుంచి తొలి రాకెట్ ప్రయోగానికి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC)లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో సోమనాథ్ (S Somanath) పాల్గొని మాట్లాడారు.
‘ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక తన మార్గంలో దూసుకెళ్తోంది. దాదాపు తన చివరి దశకు చేరుకుందని భావిస్తున్నా. దాన్ని ‘ఎల్1 పాయింట్’ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకుగానూ చివరి సన్నాహాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. దీనికి సంబంధించి బహుశా వచ్చే ఏడాది జనవరి 7 నాటికి తుది విన్యాసాలు పూర్తి చేస్తాం’ అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఓ వార్తా సంస్థకు వివరించారు. ఇదిలా ఉండగా.. చంద్రయాన్-3 విజయం తర్వాత సెప్టెంబరు 2న ‘ఆదిత్య ఎల్1’ను ఇస్రో ప్రయోగించిన విషయం తెలిసిందే. పీఎస్ఎల్వీ సీ-57 వాహకనౌక ద్వారా ఈ ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టారు.
సౌర వాతావరణాన్ని లోతుగా అధ్యయనం చేయడం ‘ఆదిత్య ఎల్1’ లక్ష్యం. భారత్ తరఫున సూర్యుడిని పరిశోధించేందుకు ఇస్రో చేపట్టిన తొలి మిషన్ ఇదే. భూమి నుంచి 15 లక్షల కి.మీ దూరంలో ఉన్న లగ్రాంజ్ పాయింట్-1 చేరాక.. దాని కక్ష్యలో పరిభ్రమిస్తూ అధ్యయనం మొదలుపెడుతుంది. ఈ వ్యోమనౌక మొత్తం ఏడు పేలోడ్లను మోసుకెళ్లింది. సౌర వాతావరణం, సౌర జ్వాలలు, కరోనల్ మాస్ ఎజెక్షన్ తదితర విషయాలను అధ్యయనం చేసేందుకు ఇవి కీలకమైన సమాచారాన్ని అందించనున్నాయి.
👉 – Please join our whatsapp channel here –