DailyDose

బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం

బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం

బెంగళూరులో హిందీ వర్సెస్ కన్నడ వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. నగరంలో వాణిజ్య దుకాణాలకు ఉండే బోర్డులను కన్నడలోనే ఉంచాలని బెంగళూరు నగర మహాపాలిక సంస్థ ఆదేశాలు జారీ చేసింది. నేమ్‌ ప్లేట్‌లపై 60 శాతం కన్నడ పదాలని ఉపయోగించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని బృహత్ బెంగళూరు మహానగర పాలిక చీఫ్ కమిషనర్ తుషార్ గిరి నాథ్ తెలిపారు. కర్ణాటక రక్షణ వేదిక (కెఆర్‌వి) సమక్షంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు.

“నగరంలో 1400 కి.మీ మేర ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ రోడ్లు ఉన్నాయి. ఈ రోడ్లపై ఉన్న అన్ని వాణిజ్య దుకాణాలను మండలాల వారీగా సర్వే చేసి.. అనంతరం 60 శాతం కన్నడ వాడని దుకాణాలకు నోటీసులు ఇస్తాం. నోటీసు జారీ చేసిన తర్వాత కన్నడ భాషా నేమ్‌ప్లేట్‌లను అమలు చేయడానికి ఫిబ్రవరి 28 లోగా సమయం ఇస్తాం. ”అని గిరి నాథ్ చెప్పారు.

కొత్త ఆదేశాల తర్వాత కేఆర్‌వి మద్దతుదారుడు దుకాణాదారులను హెచ్చరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఇది కర్ణాటక. కన్నడ మాట్లాడే ప్రజలు ఈ రాష్ట్రానికి గర్వకారణం. మీ రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు చేసుకోండి. మార్వాడీలందరికీ కన్నడ రావాల్సిందే.’ అని ఓ మహిళ బెదిరిస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది.

కర్ణాటకలో నివసించే ప్రజలందరికీ కన్నడ రావాల్సిందేనని సీఎం సిద్ధరామయ్య గత అక్టోబర్‌లో ఇప్పటికే స్పష్టం చేశారు. దీంతో అప్పట్లోనే కన్నడ వర్సెస్ హిందీ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. సిద్ధరామయ్య గతంలోనూ కన్నడ భాషపై ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. బ్యాంకుల్లో ఉద్యోగులకు కన్నడ తప్పకుండా రావాలని ఆదేశించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z