Business

‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ కనీస టికెట్‌ ధర తెలుసా?

‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ కనీస టికెట్‌ ధర తెలుసా?

కొన్ని ప్రత్యేక హంగులు ఉండేలా రైల్వేశాఖ కొత్తగా ప్రవేశపెడుతున్న ‘అమృత్‌ భారత్‌’ ఎక్స్‌ప్రెస్‌ (Amrit Bharat Express) రైళ్లలో ద్వితీయ శ్రేణి, స్లీపర్‌ తరగతుల్లో టికెట్‌ ఛార్జీలు ఇతర మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌ల కంటే 15-17% ఎక్కువగా ఉంటాయి. 50 కి.మీ.లోపు దూరానికి కనీస టికెట్‌ ధర రూ.35గా ఉంటుంది. దానికి రిజర్వేషన్‌ రుసుం, ఇతర ఛార్జీలు అదనమని రైల్వేబోర్డు అన్ని జోన్లకు సమాచారమిచ్చింది. ఈ రెండు తరగతుల్లో ఏయే దూరానికి ఎంతెంత ఛార్జీలు వసూలు చేసేదీ తెలిపే పట్టికను దానికి జతచేసింది. ప్రభుత్వం తిరిగి చెల్లించని (రీయంబర్స్‌ చేయని) రాయితీ/ ఉచిత టికెట్లను ఈ రైల్లో అనుమతించబోరు. రైల్వే సిబ్బందికి ఇచ్చే పాసులు, ప్రివిలేజ్‌ టికెట్‌ ఆర్డర్‌ (పీటీవో)ల విషయంలో నిబంధనలు.. మెయిల్‌/ ఎక్స్‌ప్రెస్‌లతో సమానంగా ఉంటాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమరయోధుల టికెట్ల సొమ్మును ప్రభుత్వం పూర్తిగా తిరిగి చెల్లిస్తున్నందువల్ల వారి పాసులు/ కూపన్లు ఈ రైళ్లలో చెల్లుతాయి. అయోధ్య నుంచి బయల్దేరేలా తొలి అమృత్‌ భారత్‌ రైలుకు ప్రధాని నరేంద్రమోదీ ఈ నెల 30న ఆ నగరంలో జెండాఊపి ప్రారంభించనున్నారు. తొలిరైలులో సెకెండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌ మాత్రమే ఉంటాయి. ఏసీ తరగతుల రుసుములు ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z