చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ (Xiaomi) గురువారం తమ తొలి విద్యుత్ కారును ఆవిష్కరించింది. బీజింగ్లో జరిగిన కార్యక్రమంలో కంపెనీ సీఈఓ ‘లీ జున్’ దీన్ని పరిచయం చేశారు. ఎస్యూ7 (SU7) పేరిట వస్తున్న ఈ సెడాన్లో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ను.. కంపెనీ ప్రముఖ ఫోన్లతో అనుసంధానమయ్యేలా రూపొందించారు. చైనాలో దిగ్గజ కంపెనీలుగా పేరొందిన ‘కాన్టెంపరరీ యాంపరెక్స్ టెక్నాలజీ’, బీవైడీ నుంచి తీసుకున్న బ్యాటరీలను ఈ కార్లలో వినియోగిస్తున్నారు.
వచ్చే 15-20 ఏళ్లలో ప్రపంచంలో తొలి ఐదు దిగ్గజ వాహన తయారీ సంస్థల్లో ఒకటిగా నిలుస్తామని లీ జున్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కారుని ‘సెల్-టు-బాడీ’ టెక్నాలజీతో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. దీంతో బ్యాటరీని నేరుగా వాహన నిర్మాణానికే అనుసంధానం చేసినట్లు వివరించారు. ఫలితంగా కారు దృఢత్వం పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికే కంపెనీ రూపొందించిన అనేక యాప్లకు ఈ కారులో యాక్సెస్ ఉంటుందన్నారు.
ఈ కారు ఎస్యూ7, ఎస్యూ7 మ్యాక్స్ పేరిట రెండు వేరియంట్లలో లభించనుంది. ఎస్యూ 7 విషయానికి వస్తే.. 0-100 kmph వేగాన్ని 5.28 సెకన్లలో అందుకుంటుందని కంపెనీ తెలిపింది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 668 కిలోమీటర్లు వెళ్తుంది. గరిష్ఠ వేగం 210 కి.మీ/గం. అత్యధికంగా 400 ఎన్ఎం టార్క్ వద్ద 299 పీఎస్ శక్తిని విడుదల చేస్తుంది. మరోవైపు ఎస్యూ7 మ్యాక్స్ 2.78 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకుంటుంది. ఒక్క ఛార్జింగ్తో 800 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. దీని గరిష్ఠ వేగం 265 కి.మీ/గం. 838 ఎన్ఎం టార్క్ వద్ద 673 పీఎస్ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
ఈ కార్ల ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. కానీ, కొంచెం ఎక్కువే చెల్లించాల్సి ఉంటుందని లీ జున్ తెలిపారు. అయితే, కారును చూసిన తర్వాత ధర సమంజసంగానే ఉందని కస్టమర్లు భావిస్తారని వ్యాఖ్యానించారు. మరోవైపు తక్కువ ఉష్ణోగ్రతల్లోనూ వేగంగా ఛార్జ్ అయ్యేలా కారుని అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. పరిశ్రమలో తమ కారుదే మెరుగైన అటానమస్ డ్రైవింగ్ వ్యవస్థ అని తెలిపారు. ఆక్వా బ్లూ, మినరల్ గ్రే, వెర్డంట్ గ్రీన్ రంగుల్లో ఈ కారు లభిస్తుంది.
వచ్చే దశాబ్దకాలంలో వాహన రంగంలో 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని గతంలో షావోమీ ప్రకటించిన విషయం తెలిసిందే.
👉 – Please join our whatsapp channel here –