Agriculture

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచిన జగన్‌ సర్కార్

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలను పెంచిన జగన్‌ సర్కార్

ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువ.. బహిరంగ మార్కెట్‌ ధర కంటే తక్కువగా ఉండటం ఎక్కడైనా సర్వసాధారణం. ఘనత వహించిన జగన్‌ సర్కారు మాత్రం ఈ విషయంలోనూ రివర్స్‌లోనే వెళుతోంది. చాలాచోట్ల ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలను వాటి అసలు ధర కంటే పెంచేసింది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు కాసులు గలగలలాడుతుంటే.. రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెరిగిపోయి కొనుగోలుదారులు విలవిల్లాడిపోతున్నారు.

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు.. ఆస్తి కొనుక్కున్నవాళ్లకు కరెంట్‌ షాక్‌లా తగులుతున్నాయి. అడ్డగోలుగా పెంచేసిన ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలు కొనుగోలుదారుల కళ్లలో నీళ్లు తెప్పిస్తున్నాయి. అప్పోసప్పో చేసి ఆస్తి కొనుక్కున్నామన్న ఆనందాన్ని ఆవిరి చేసేలా వాటి రిజిస్ట్రేషన్‌ విలువలు, ఛార్జీలు పెంచి జగన్‌ సర్కారు వికృతానందం పొందుతోంది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు అధికారులు రిజిస్ట్రేషన్‌ విలువలను ఎలాంటి శాస్త్రీయ పరిశీలన లేకుండా అడ్డగోలుగా పెంచేశారు. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు వసూలు చేస్తూ ప్రభుత్వం.. ఆస్తుల కొనుగోలుదారులను నిలువునా దోచేస్తోంది. నరసరావుపేట- గుంటూరు రోడ్డులో జొన్నలగడ్డ రెవెన్యూ పరిధిలో కప్పగంజివాగు సమీపంలో వాస్తవ ధర ఎకరా రూ.కోటి. కానీ రిజిస్ట్రేషన్‌ ధర రూ.4.8 కోట్లు ఉండటం.. జనాన్ని దోచేయడంలో జగన్‌ సర్కారు చేతివాటానికి నిఖార్సైన నిదర్శనం.

రాష్ట్ర ప్రభుత్వం అసాధారణ రీతిలో ఆస్తుల రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచేసి పేద, మధ్యతరగతి వర్గాల నడ్డి విరుస్తోంది. చాలా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్‌ కంటే ప్రభుత్వం ఖరారు చేసిన రిజిస్ట్రేషన్‌ విలువలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల తక్కువ ధరకు ఇళ్లు, స్థలాలు కొనుక్కున్నప్పటికీ స్టాంపు డ్యూటీ కింద అదనపు భారం భరించాల్సి వస్తోంది. ప్రభుత్వ పెద్దల మెప్పు పొందేందుకు అధికారులు రిజిస్ట్రేషన్‌ విలువల పెంపులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని మాధవాయిపాలెంలో ప్రభుత్వం మార్కెట్‌ విలువను గజం రూ.23 వేలుగా నిర్ధారించింది. ఇక్కడ బహిరంగ మార్కెట్‌లో గజం భూమి ధర రూ.15 వేల వరకే ఉంది. వాస్తవానికి గతంలో ఇక్కడ భూమి ప్రభుత్వ మార్కెట్‌ ధర గజం రూ.10 వేలే ఉండేది. అప్పట్లో భూమి కొనుక్కున్నవారు కొందరు ఎక్కువ మొత్తంలో బ్యాంకు రుణాలు పొందేందుకు, ఇతర ప్రయోజనాల కోసం రిజిస్ట్రేషన్ల సమయంలో ఎక్కువ ఫీజు చెల్లించారు. దీన్ని గమనించకుండానే అధికారులు రిజిస్ట్రేషన్‌ విలువలను పెంచేశారు.

మరికొన్నిచోట్ల గజం రిజిస్ట్రేషన్‌ విలువ కంటే రూ.2 వేల తక్కువకే భూముల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం 100 గజాల భూమిని కొన్నవారిపై రూ.20 వేల అదనపు భారం పడుతోంది. విజయవాడ శివారులోని ఇబ్రహీంపట్నం పరిసరాల్లో గజం స్థలం రిజిస్ట్రేషన్‌ విలువ రూ.8 వేల నుంచి రూ.10,700 వరకు ఉంది. కానీ అక్కడ బహిరంగ మార్కెట్‌లో ఆస్తి రూ.7 వేల నుంచి రూ.8 వేల మధ్యే అమ్ముతున్నారు. నంద్యాల జిల్లా అవుకులో గజం భూమికి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం మార్కెట్‌ విలువను రూ.1,400గా నిర్ధారించారు. అంటే సెంటు భూమి రూ.67,760. అవుకు శివార్లలో సెంటు భూమి రూ.40 వేల నుంచి రూ.50 వేలకే లభిస్తోంది. అక్కడ కొనుక్కున్నవారు కొందరు అసలు ధర కన్నా అధికంగా రూ.17,760 స్టాంపు డ్యూటీ కింద చెల్లించాల్సి వస్తోంది.

మురికివాడలున్న చోటా బాదుడే
విజయవాడ సెంట్రల్‌ దేవీనగర్‌ (సింగ్‌నగర్‌ ఫ్లైఓవర్‌ పక్కన) రోడ్డు మొదట్లో రూ.17 వేల వరకు ఉంటే దావు బుచ్చయ్యకాలనీ, గద్దె వెంకట్రామయ్యనగర్‌లలో గజం మార్కెట్‌ విలువ రూ.33 వేలు ఉంది. ఇక్కడే ఉన్న మధురానగర్‌లో రూ.28 వేల వరకు పెంచేశారు. మురికివాడల్లోనూ స్టాంపు డ్యూటీ ఎక్కువగా ఖరారు చేశారు. జక్కంపూడి కాలనీ, అజిత్‌సింగ్‌నగర్‌, ఉడా కాలనీల్లో ప్రభుత్వ, మార్కెట్‌ ధరలకు భారీ వ్యత్యాసం ఉంది. విజయవాడ విలేజ్‌ పోర్షన్‌ మురికివాడల్లో ప్రభుత్వ, ప్రైవేటు మార్కెట్‌ విలువలు సమానంగా ఉన్నాయి. విజయవాడ వన్‌టౌన్‌లోని సిండికేట్‌ బ్యాంకు కాలనీ వద్ద ప్రభుత్వ మార్కెట్‌ విలువ గజం రూ.17 వేలు. అదే రోడ్డు చివర్లోని అంబేడ్కర్‌ కాలనీలో గజం రూ.30 వేలు. డోర్‌ నంబరు ఆధారంగా విలువలను 80 శాతం పెంచేశారు.

ఉమ్మడి గుంటూరు జిల్లాలో..
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో కొన్నిచోట్ల మాత్రమే బహిరంగ మార్కెట్‌ ధర గజం రూ.7,8 వేలు ఉంది. అత్యధిక ప్రాంతాల్లో రూ.4, 5 వేలకు మించి లేదని స్థిరాస్తి వ్యాపారులు చెబుతున్నారు. నగర శివారు గోరంట్ల, అగతవరప్పాడు, వెనిగండ్ల తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ రిజిస్ట్రేషన్‌ విలువ గజం రూ.7 వేలుండగా స్థిరాస్తి వెంచర్లలో ప్లాట్లు గజం రూ.5 వేల చొప్పున విక్రయిస్తున్నారు.

అనకాపల్లి జిల్లాలో..
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పురపాలక సంఘం బలిఘట్టం శివార్లలో వ్యవసాయ భూమి మార్కెట్‌ విలువ ఎకరాకు రూ.38 లక్షలు, వ్యవసాయ భూమిలో మొక్కలుంటే రూ.40 లక్షలుగా నిర్ణయించారు. బయ్యపురెడ్డిపాలెం ప్రాంతంలో రోడ్డుకు దూరంగా ఉన్న కొన్ని భూములు రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల లోపునే లభిస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన మార్కెట్‌ విలువకు స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి వస్తోంది.

మార్కెట్‌ విలువలు పెంచే ముందు ఈ విషయాలు పరిశీలించాలి..

ఆయా ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌ లావాదేవీలు ఎలా జరుగుతున్నాయి?
అభివృద్ధి ఏ స్థాయిలో ఉంది?
చదరపు గజం ధర ఎంత ఉంది?
దాని మార్కెట్‌ విలువ పెంచాలా లేదా తగ్గించాలా? అనే అంశాలపై నిశితంగా అధ్యయనం చేయాలి.
– ఇవేమీ లేకుండానే చాలాచోట్ల మార్కెట్‌ విలువలను అమాంతం పెంచేశారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z