Politics

ఏపీ రాజకీయాలపై షర్మిలకు ఆసక్తి లేదా?

ఏపీ రాజకీయాలపై షర్మిలకు ఆసక్తి లేదా?

ఏపీ రాజకీయాలపై షర్మిలకు ఆసక్తి లేదని.. అన్న జగన్‌ ఇబ్బందులు పెట్టడం వల్లే ఆమె రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తున్నారని తెదేపా మాజీ ఎమ్మెల్సీ బీటెక్‌ రవి వెల్లడించారు. ‘అన్న సీఎంగా ఉన్న సమయంలో ఏపీ రాజకీయాల్లోకి వస్తే బాగుండదని ఇన్ని రోజులూ షర్మిల మౌనంగా ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో తాము ఏపీ రాజకీయాల్లోకి రావాల్సి వస్తోందని ఆమె భర్త బ్రదర్‌ అనిల్‌కుమార్‌ చెప్పారు’ అని రవి వివరించారు. తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి శుభలేఖను.. అన్న జగన్‌కు ఇచ్చేందుకు షర్మిల ప్రత్యేక విమానంలో బుధవారం కడప నుంచి విజయవాడ వచ్చారు. అందులో ఖాళీ లేకపోవడంతో బ్రదర్‌ అనిల్‌కుమార్‌.. మరో విమానంలో విజయవాడ బయలుదేరారు. అదే విమానంలో బీటెక్‌ రవి ప్రయాణిస్తున్నారు. ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన చర్చల వివరాలను రవి మీడియాకు వివరించారు. ‘మా ఇద్దరి మధ్య జరిగిన చర్చల్లో.. కాంగ్రెస్‌లో షర్మిల చేరిక విషయం ప్రస్తావనకు వచ్చింది. గురువారం వారిద్దరూ పార్టీలో చేరుతున్నట్లు అనిల్‌కుమార్‌ నాతో చెప్పారు. షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తారా? సీడబ్ల్యూసీ సభ్యురాలిగా నియమిస్తారా? అనే విషయమై స్పష్టత లేదన్నారు. పీసీసీ అధ్యక్ష పదవిని స్వీకరిస్తే రాష్ట్ర రాజకీయాలు ఎలా ఉంటాయనే విషయమై కొంతసేపు మాట్లాడుకున్నాం. కడప రాజకీయాలపై నా అభిప్రాయాలను అనిల్‌కుమార్‌కు చెప్పాను’ అని రవి వివరించారు.

👉 – Please join our whatsapp channel here –

https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z