* ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ.. 2023లో భారత వస్తు సేవల ఎగుమతుల (Indian Exports) విలువ 0.4 శాతం పెరిగి 765.6 బిలియన్ డాలర్లకు చేరింది. ఎలక్ట్రానిక్స్, ఔషధ, పత్తి, వస్త్ర, సిరమిక్, మాంసం, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పండ్ల ఎగుమతులు అందుకు దోహదం చేసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది. ఒక్క వస్తువుల ఎగమతులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే గత ఏడాది 4.71 శాతం తగ్గి 431.9 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి. సేవల ఎగమతులు (Imports) మాత్రం 7.88 శాతం పుంజుకొని 388.8 బిలియన్ డాలర్లకు చేరాయి. అదే సమయంలో వస్తువుల దిగుమతులు సైతం ఏడు శాతం తగ్గి 667.73 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. భారత ఎగుమతులు ప్రధానంగా అమెరికా, యూఏఈ, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, యూకే, జర్మనీలకు చేరాయి.
* ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ (Tata motors) వాహన ధరల పెంపునకు (Price hike) సిద్ధమైంది. ప్యాసింజర్, విద్యుత్ వాహన (EV) ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది. ఎక్స్షోరూం ధరలపై 0.7శాతం వరకు పెంపు ఉంటుందని పేర్కొంది. కొత్త ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. నిర్వహణ వ్యయాలు, ముడి సరకుల ధరలు పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ ఆ ప్రకటనలో వివరించింది. ప్రస్తుతం పంచ్ (Punch), నెక్సాన్ (Nexon), హారియర్ (Harrier) సహా పలు రకాల కార్లను విక్రయిస్తోంది. నూతన సంవత్సరంలో వాహన ధరల్ని పెంచనున్నట్లు ఇప్పటికే అనేక సంస్థలు ప్రకటించిన విషయం తెలిసిందే.
* రిపబ్లిక్ డే సేల్ సమయంలో ఆఫర్లు ఉన్నాయన్న ఉద్దేశంతో మధ్యప్రదేశ్కు చెందిన సౌరో ముఖర్జీ అనే వ్యక్తి రూ.1.13లక్షలు వెచ్చించి ఇ-కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్కార్ట్లో జనవరి13న ల్యాప్టాప్ బుక్ చేశాడు. జనవరి 14న పార్సిల్ వచ్చింది. డెలివరీ బాయ్ పార్సిల్ని తెరిచి చూపించగానే అందులో ఉన్న ల్యాప్టాప్ని చూసి షాక్ అయ్యాడు. స్క్రీన్, కీబోర్డుపై బాగా దుమ్ముఉండటాన్ని చూసి అటు యూజర్ ఇటు డెలివరీ బాయ్ ఇద్దరూ ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోను ముఖర్జీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ (గతంలో ట్విటర్) లో పోస్ట్ చేశాడు. దీనిపై ఫ్లిప్కార్ట్ స్పందించింది. ఇలా జరిగినందుకు మమ్మల్ని క్షమించండి. ఆర్డర్ వివరాలు తెలియజేస్తే మీకు సాయం చేస్తాం అంటూ సంస్థ పేర్కొంది.
* అయోధ్యలో రామ మందిర ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఈ నెల 22న పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యాలయాలు, విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ బ్యాంకులు హాఫ్ డే సెలవు ఇచ్చాయి. ఉత్తర ప్రదేశ్లో మాత్రం ప్రైవేట్ బ్యాంకులు మూసివేస్తారని ఆర్బీఐ తాజాగా ఇచ్చిన అప్ డేట్లో తెలిపింది. ఇతర రాష్ట్రాల్లోని బ్యాంకులు మాత్రం రెగ్యులర్ టైమింగ్స్ ప్రకారం తెరిచి ఉంచుతారని పేర్కొంది. ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రైవేట్ బ్యాంకులు కూడా మూసి ఉంచుతారని ఆర్బీఐ తన వెబ్ సైట్లో తెలిపింది.
* హెచ్డీఎఫ్సీ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,22,163.07 కోట్లు నష్టపోయి రూ.11,22,662.76 కోట్లకు పరిమితమైంది. బ్యాంక్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలు మార్కెట్లను మెప్పించలేకపోయాయి. దీంతో ఇన్వెస్టర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టాక్స్ విక్రయానికి ప్రాధాన్యం ఇవ్వడంతో వరుసగా మూడో రోజు శుక్రవారం 12 శాతానికి పైగా నష్ట పోయింది. శనివారం ట్రేడింగ్ లో తిరిగి పుంజుకుని 0.54 శాతం లాభ పడింది.
👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z