DailyDose

జ్ఞానపీఠ్‌ పురస్కారాలు

జ్ఞానపీఠ్‌ పురస్కారాలు

ప్రముఖ ఉర్దూ కవి, సినీ గేయరచయిత గుల్జార్‌, సంస్కృత పండితుడు జగద్గురు రామభద్రాచార్య లు 58వ ‘జ్ఞానపీఠ్‌’ పురస్కారానికి ఎంపికయ్యారు. 2023 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ్‌ ఎంపిక కమిటీ శనివారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

గుల్జార్‌గా ప్రసిద్ధి చెందిన సంపూరణ్ సింగ్ కల్రా (89).. హిందీ సినిమాల్లో గీత రచయితగా, దర్శకుడిగా, స్ర్కీన్‌రైటర్‌గా పనిచేస్తున్నారు. పలు పుస్తకాలూ రాశారు. ప్రస్తుత తరంలో గొప్ప ఉర్దూ కవుల్లో ఒకరిగా పేరుపొందారు. 2002లో సాహిత్య అకాడమీ, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే, 2004లో పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు. చలనచిత్ర రంగంలో ఐదు జాతీయ అవార్డులూ సొంతం చేసుకున్నారు. ‘స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌’ సినిమాలోని జై హో… పాటను గుల్జార్‌ రాయగా.. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరపరిచారు. ఈ పాటకి ఉత్తమ స్కోర్‌ విభాగంలో ఆస్కార్‌ అవార్డు వచ్చింది.
రామభద్రాచార్య (74) మధ్యప్రదేశ్‌ చిత్రకూట్‌లోని తులసీ పీఠం వ్యవస్థాపకులు, పీఠాధిపతి. ప్రముఖ హిందూ ఆధ్యాత్మికవాది, విద్యావేత్తగా పేరుపొందారు. 240కుపైగా పుస్తకాలు రాశారు. 22 భాషల్లో ప్రావీణ్యులు. సంస్కృతం, హిందీ, అవధి, మైథిలీ సహా అనేక భారతీయ భాషల్లో రచనలు చేశారు. 2015లో పద్మవిభూషణ్ అవార్డు అందుకున్నారు.
భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ‘జ్ఞానపీఠ్ అవార్డు’ను అందజేస్తారు. 1944లో ఏర్పాటైన ఈ పురస్కారాన్ని.. దేశంలోనే అత్యున్నత సాహిత్య గౌరవంగా పరిగణిస్తారు. సంస్కృత భాషకు ఈ అవార్డును అందజేయడం ఇది రెండోసారి కాగా, ఉర్దూలో ఐదోసారి.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z