Movies

వెల్‌కమ్‌ టు అంజనాద్రి 2.0

వెల్‌కమ్‌ టు అంజనాద్రి 2.0

తేజ సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన సూపర్‌ హీరో చిత్రం ‘హనుమాన్‌’. సంక్రాంతి కానుకగా విడుదలై విశేష ఆదరణ సొంతం చేసుకుంది. దీనికి కొనసాగింపుగా ‘జై హనుమాన్‌’ రానుందని చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. దీంతో సీక్వెల్‌ అప్‌డేట్స్‌ కోసం సినీ ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్‌ వర్మ స్పెషల్‌ గ్లింప్స్‌ షేర్‌ చేశారు. చుట్టూ అందమైన కొండలు.. మధ్యలో పెద్ద నది.. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని చూపిస్తూ ‘‘వెల్‌కమ్‌ టు అంజనాద్రి 2.0’’ అని పేర్కొన్నారు. #JaiHanuman హ్యాష్‌ట్యాగ్‌ జత చేశారు. ఈ వీడియోకు ‘హనుమాన్‌’లోని ‘రఘునందన’ సాంగ్‌ అటాచ్‌ చేశారు. ప్రస్తుతం ఇది నెట్టింట వైరల్‌గా మారింది.

‘శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటి?’ అనే ప్రశ్నకు సమాధానంగా ‘జై హనుమాన్‌’ రూపుదిద్దుకోనుంది. 2025లో విడుదల కానుంది. జనవరి నెలలోనే ప్రీ ప్రొడక్షన్‌ పనులు మొదలయ్యాయి. త్వరలోనే షూట్‌ ప్రారంభించనున్నారు. ‘‘హను-మాన్‌’ కంటే వందరెట్లు భారీ స్థాయిలో ‘జై హనుమాన్‌’ ఉంటుంది. సీక్వెల్‌లో తేజ సజ్జా హీరో కాదు. హనుమంతు పాత్రలో కనిపిస్తాడు. హీరో ఆంజనేయ స్వామి. ఆ పాత్రను స్టార్‌ హీరో చేస్తారు. దీనికంటే ముందు నా నుంచి మరో రెండు చిత్రాలు రానున్నాయి. అందులో ఒకటి ‘అధీర’. మరొకటి ‘మహాకాళి’’ అని ప్రశాంత్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. సూపర్‌ హీరో కథకు ఇతిహాసాన్ని ముడిపెట్టి తీసిన చిత్రం ‘హను-మాన్‌’. తేజ సజ్జా హీరోగా నటించగా.. అమృతాఅయ్యర్‌ కథానాయిక పాత్ర పోషించారు. వరలక్ష్మి శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, గెటప్‌ శ్రీను, వెన్నెల కిషోర్‌ కీలక పాత్రల్లో కనిపించారు. రూ.40 కోట్ల వ్యయంతో తెరకెక్కిన ఈ చిత్రం సుమారు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసినట్లు అంచనా. ప్రస్తుతం ఇది జీ5 వేదికగా అందుబాటులో ఉంది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z