ScienceAndTech

Ather విద్యుత్ స్కూటర్…ఒకసారి ఛార్జింగ్‌తో 123కిమీ

Ather విద్యుత్ స్కూటర్…ఒకసారి ఛార్జింగ్‌తో 123కిమీ

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్‌ వాహన తయారీ సంస్థ ఏథర్‌ (Ather) ఫ్యామిలీ స్కూటర్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది. ఏథర్‌ రిజ్తా (Rizta) పేరిట కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను తీసుకొచ్చింది. మునుపటి 450 మోడల్స్‌లా కాకుండా లుక్‌ పరంగా ఇందులో చాలావరకు మార్పులు చేశారు. అధిక లెగ్‌స్పేస్‌, పొడవాటి సీటుతో దీన్ని తీసుకొచ్చారు. రిజ్తా ఎస్‌, రిజ్తా జడ్‌ వేరియంట్లలో ఇది లభిస్తుంది. ఇవి 2.9 కిలోవాట్‌ బ్యాటరీతో వస్తుండగా.. రిజ్తా జడ్‌లో 3.7 కిలోవాట్‌తో టాప్‌- ఎండ్‌ మోడల్‌ను ఏథర్‌ లాంచ్‌ చేసింది. రిజ్తా ఎస్‌ ధర రూ.1.10 లక్షలుగా (ఎక్స్‌షోరూం, బెంగళూరు) కంపెనీ నిర్ణయించింది. ఇది సింగిల్‌ ఛార్జింగ్‌తో 123 కిలోమీటర్ల రేంజ్‌ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇక రిజ్తా జడ్‌ మోడల్‌ ధరను రూ.1.25 లక్షలుగా నిర్ణయించింది. ఇది కూడా 123 కిలోమీటర్ల రేంజ్‌ వస్తుంది. ఇందులోని టాప్‌ వేరియంట్‌ ధర రూ.1.45 లక్షలుగా పేర్కొంది. ఈ స్కూటర్‌పై గరిష్ఠంగా 160 కిలోమీటర్లు ప్రయాణించొచ్చు. ఈ మూడు స్కూటర్ల టాప్‌ స్పీడ్‌ గంటకు 80 కిలోమీటర్లు.

రిజ్తా ఎస్‌ మూడు రంగుల్లో వస్తుండగా.. రిజ్తా జడ్‌ ఏడు రంగుల్లో లభిస్తుంది. స్కూటర్లలో స్మార్ట్ ఎకో, జిప్‌ మోడల్‌లు ఉన్నాయి. ట్రాక్షన్‌ కంట్రోల్‌, ఎమర్జెన్సీ స్టాప్‌ సిగ్నల్‌, థెఫ్ట్‌ డిటెక్ట్‌, మ్యాజిక్‌ ట్విస్ట్, ఆటో హోల్డ్‌, రివర్స్‌ మోడ్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. బేస్‌ వేరియంట్‌లో 7 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే ఉంటుంది. మిగిలిన రెండు వేరియంట్లలో 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో 56 లీటర్ల స్టోరేజ్‌ లభిస్తుంది. స్కూటర్లతో పాటు ఏథర్‌ హాలో, హాలో బిట్‌ పేరిట రెండు స్మార్ట్‌ హెల్మెట్లను ఏథర్‌ తీసుకొచ్చింది. హాలో హెల్మెట్‌ ధర రూ.14,999, హాలో బిట్‌ ధర రూ.4,999 గా నిర్ణయించింది.

👉 – Please join our whatsapp channel here –
https://whatsapp.com/channel/0029Va9VucP7oQhZ7fePda2Z