జగన్, పవన్.. మధ్యలో బాబు.. హాట్ హాట్గా పొలిటికల్ ఫైట్ ..
రాజకీయ అంశాలు, విధానాలపై జరగాల్సిన మాటల యుద్ధం వ్యక్తిగత విమర్శలదాకా వెళ్లింది.
ప్రజల గురించి మాట్లాడాల్సిన నాయకులు పెళ్లాళ్ల గురించి మాట్లాడుతున్నారు.
ఏపీ సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మధ్య పంచాయితీ తీవ్రస్థాయికి చేరింది.
రెండుపార్టీల అధినేతల మధ్య ఈ కొత్త ఫైటింగ్ ఆరంభంలోనే అదుర్స్ అనిపిస్తోంది.
మరోవైపు నేనూ ఉన్నానంటూ టిడిపి చీఫ్ చంద్రబాబు కూడా ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిపైనా నిప్పులు చెరుగుతున్నారు.
పవన్ కల్యాణ్, జగన్మోహన్రెడ్డి మధ్య ఎన్నోఏళ్లుగా రగులుతున్న అగ్నిపర్వతం బద్దలైంది.
ప్రజారాజ్యంలో ఉన్నప్పడు పంచలూడదీసి కొడతానన్న పవన్ కల్యాణ్ డైలాగ్స్, జనసేన జెండానీడలో 2014 నుంచి సాగుతున్న పవన్ విమర్శల పరంపరకు వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తూనే ఉన్నారు.
అయితే, గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో జగన్, పవన్ను నిత్యపెళ్లికొడుకు అంటూ విమర్శించారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ అమరావతి, ఇసుక, తెలుగు మీడియం అంశాలపై పదునైన విమర్శలు చేస్తున్నారు.
వాటికి కౌంటర్ ఇస్తూనే జగన్.. పెళ్లిళ్ల అంశంపై పవన్పై ధ్వజమెత్తారు. తాజాగా ఇసుకపై గవర్నర్కి ఫిర్యాదు చేసిన పవన్ కల్యాణ్, సీఎం జగన్కు అంతే గట్టిగా సమాధానమిచ్చారు.
జగన్ ఏదిపడితే అది మాట్లాడితే పడి ఉండటానికి తమది టీడీపీ కాదనీ, జనసేన అని గుర్తుచేస్తున్నారు పవన్.
తెలుగుభాషపై కూడా ఇద్దరు నేతల మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి.
రాష్ట్రాభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం తెచ్చిందని జగన్ అంటే, ఇంగ్లీష్ మీడియం మీద అంత ప్రేమ ఉంటే.. తిరుమలలో సుప్రభాతాన్ని కూడా ఇంగ్లీష్లో చదివించాలని పవన్ సలహా ఇచ్చారు.
జనసేన, టీడీపీ ఒకటేననీ.. పవన్ దత్తపుత్రుడనీ వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు.
ఇందుకు భిన్నంగా ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్.. పవన్ మీద వ్యక్తిగత అంశాలతో విరుచుకుపడుతున్నారు.
దీంతో ఏపీలో రెండుపార్టీల అధినేతల మధ్య హై టెన్షన్ వార్ మొదలైంది.
ఇది ఎక్కడిదాకా వెళుతుందన్నదే చర్చనీయాంశం.
మరోవైపు గురువారం నాడు విజయవాడలో నిరాహార దీక్షకు సిద్దమవుతున్న టిడిపి అధినేత చంద్రబాబు ప్రభుత్వం విరుచుకుపడుతున్నారు.
ఇసుకపై తాను దీక్షకు సిద్దం కాగానే ఇసుక విక్రయాలను పెంచే చర్యలకు జగన్ ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని చంద్రబాబు అంటున్నారు.
మరోవైపు తన టీమ్తో జగన్ ప్రభుత్వంపై చార్జీషీట్ విడుదల చేయించారు చంద్రబాబు.
ఇసుక కొరతకు, కార్మికుల ఆత్మహత్యలకు కారణం వీరంటూ ఏపీ తీర ప్రాంతానికి చెందిన పలువురు మంత్రులు, వైసీపీ నేతల పేర్లను చార్జీషీట్లో చేర్చారు టిడిపి నేతలు.
మొత్తమ్మీద మూడు పార్టీల దూషణల పర్వంతో ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి.