Movies

ఇస్మార్ట్ డైలాగులు చెప్పమని వేధిస్తున్నారు

Nabha Natesh Speaks Of Her Fan Base

‘నన్ను దోచుకుందువటే’ చిత్రం ద్వారా తెలుగు చిత్రసీమకు పరిచయమైంది కన్నడ సుందరి నభానటేష్‌. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో కమర్షియల్‌ విజయాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈ భామ ‘డిస్కోరాజా’ చిత్రంలో రవితేజ సరసన కథానాయికగా నటిస్తున్నది. ఈ చిత్రం ఈ నెల 24న విడుదలకానుంది. ఈ సందర్భంగా ఆదివారం నభా నటేష్‌ పాత్రికేయులతో ముచ్చటించింది. ఆ విశేషాలివి.. 2019 నాకు ఎన్నో మధురానుభూతుల్ని మిగిల్చింది. కెరీర్‌పరంగా అదే ఉత్తమ సంవత్సరంగా చెప్పవచ్చు. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో గొప్ప విజయాన్ని దక్కించుకున్నా. ఆ కిక్‌ నుంచి ఇంకా బయటకు రాలేకపోతున్నా.నటనాపరంగా కూడా ఆ సినిమాకు మంచి ప్రశంసలు లభించాయి. నేను ఎక్కడకు వెళ్లినా అభిమానులు ‘ఇస్మార్ట్‌శంకర్‌’ డైలాగులు చెప్పమని అడుగుతున్నారు. వాటి గురించే మాట్లాడుకుంటాం..రవితేజ నటనను నేను బాగా ఇష్టపడతాను. ఆయనలోని కామెడీ టైమింగ్‌ అద్భుతంగా ఉంటుంది. ‘విక్రమార్కుడు’ చిత్రం బాగా నచ్చింది. వ్యక్తిత్వపరంగా కూడా ఆయన ఆశావహదృక్పథంతో ఉంటారు. ఎవరినీ నొప్పించరు. సెట్‌లో ఉన్నప్పుడు మేమిద్దరం మంచి భోజనం గురించి.. ఆయన తోటలో పండే పండ్ల గురించి మాట్లాడుకునే వాళ్లం. ‘డిస్కోరాజా’ సినిమాలో నేను లోన్స్‌ వసూళ్లు చేసే బ్యాంక్‌ ఉద్యోగిగా కనిపిస్తాను. స్వతంత్ర భావాలతో నేటితరం అమ్మాయిలకు ప్రతినిధిలా ఉంటాను. భావోద్వేగ ప్రధానంగ నా పాత్ర సాగుతుంది. సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే చిత్రమిది. దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ కథ చెప్పగానే వెంటనే ఓకే చేశాను. పరిశ్రమలోని కథానాయికల్లో సన్నిహితులు ఎవరూ లేరు. నేను బెంగళూరులో ఉంటాను. అక్కడి నుంచే షూటింగ్‌లకు హాజరవుతుంటాను. అందువల్ల ఇక్కడ ఎక్కువ స్నేహితురాళ్లను సంపాదించుకోలేకపోయాను. నా సహచర కథానాయికల్ని చూసి చాలా విషయాల్ని నేర్చుకుంటాను. ఇండస్ట్రీలో నాయికల మధ్య పోటీ సహజం. దానిని పాజిటివ్‌గా తీసుకోవాలి. ప్రస్తుతం తెలుగులో ‘సోలో బ్రతుకే సో బెటరు’ చిత్రంతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమాలో నటిస్తున్నా. తమిళ, కన్నడ పరిశ్రమల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయి.