WorldWonders

ఇక రక్తం గురించి బెంగ అక్కర్లేదు

Artificial Blood Is Here-Telugu WorldWonders

ఎలాంటి ప్రమాదాలు జరిగినా రక్తస్రావం మాత్రం అధికంగా జరుగుతుంది. అదే బ్లడ్‌గ్రూప్‌తో ఉండేవారు దొరకకపోవడంతో ప్రాణాలు కోల్పోవడం చూస్తూనే ఉన్నాం. అందుకనే ప్రపంచంలోనే తొలిసారిగా మనిషికి అవసరమైన కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. దీని గురించిన వివరా తెలుసుకోండి. రక్తం అనగానే. బ్లడ్‌ గ్రూప్‌ ఏంటని అడుగుతారు. వాటిలో ఎన్నో రకాల గ్రూప్‌లున్నాయి. ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు వారి గ్రూప్‌ తెలుసుకొని అదే గ్రూప్‌ రక్తాన్ని ఎక్కించాల్సి వస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రక్తం ఎక్కించేందుకు ‘ఓ’ నెగెటివ్‌ రక్తాన్ని ఎంచుకుంటారు. ఈ రక్తం అన్ని గ్రూపులకు సరిపోతుంది. అయితే ఈ రక్తం కలిగిన వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. ఈ నేపథ్యంలో జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల టొకొరోజవా నగరంలోని నేషనల్‌ డిఫెన్స్‌ మెడికల్‌ కాలేజ్‌లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్‌ కలిగిన ఎర్ర రక్తకణాలను, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. వీటిలో ఆరు ప్రాణాలతో ఉండగా నాలుగు మరణించాయి. కుందేళ్ల ప్రాణం నిలిపిన ఈ కృత్రిమ రక్తం మనుషులకు సైతం మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దాతల రక్తంలోని ప్లేట్‌లెట్స్‌ను అటూ ఇటూ కదపడం ద్వారా కేవలం 4 రోజులు మాత్రమే నిల్వ ఉంచగలం. అలాగే తక్కువ ఉష్ణోగ్రతల్లో నిల్వ చేసినా కూడా 20 రోజుల్లో దాని స్వభావం మారిపోతుంది. అయితే శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ కృత్రిమ రక్తం ఏడాదిపాటు నిల్వ ఉంటుందని తెలిపారు. ఈ రక్తాన్ని ఎక్కించిన తర్వాత కుందేళ్లలో ఎలాంటి దుష్ప్రభావాలు కనిపించలేదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ రక్తం మనుషులపై కూడా సక్రమంగా పనిచేస్తే ప్రపంచంలో కొన్నికోట్ల మంది ప్రజల ప్రాణాలు నిలుస్తాయి.