Politics

కేంద్రం ఎందుకు కళ్లు చెవులు మూసుకుంది?

Chandrababu Questions Modi Govt On Amaravathi Issue

రాజధానిని శ్మశానం, ఎడారి అంటే చాలా బాధేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ 29 గ్రామాల రైతులు, మహిళల దీక్షలు 50వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా రాయపూడిలో ఏర్పాటు చేసిన దీక్షాశిబిరాన్ని చంద్రబాబు సందర్శించారు. మహిళలు, రైతులకు సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అమరావతికి వరదలు వస్తాయని, రాజధాని మునిగిపోతుందంటూ పదేపదే అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వైకాపా నేతలను విమర్శించారు. 23 ఏప్రిల్‌ 2015న కేంద్రం విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఏపీ రాజధాని అమరావతి అని.. ఈ విషయంలో రాష్ట్రాన్ని కేంద్రం ఎందుకు ప్రశ్నించడం లేదని చంద్రబాబు అన్నారు. చట్టాలను అమలు చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు. రాజధాని ఎంపికే రాష్ట్రం ఇష్టం కానీ..మార్చడం కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాజధాని కోసం అమరావతి రైతుల పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని చంద్రబాబు అన్నారు. ‘‘ అన్ని రాష్ట్రాలకంటే ఏపీ మిన్నగా ఉండాలని పని చేశా. అప్పట్లో హైదరాబాద్‌లో హైటెక్‌ సిటీ నిర్మించక పోయి ఉంటే.. ఆ నగరం అంత అభివృద్ధి చెందేదా? అన్ని కంపెనీలు అక్కడికి వచ్చేవా? అదే తరహాలో అమరావతిని కూడా నిర్మించాలనుకున్నాను. కానీ, అధికార మార్పిడి జరిగింది. వైకాపా ప్రభుత్వం వైఖరితో రాష్ట్రానికి రావాల్సిన సంస్థలన్నీ తిరిగి వెనక్కి వెళ్లిపోతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది’’ అని చంద్రబాబు అన్నారు. రైతుల పోరాటం తప్పనిసరిగా విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు. ప్రాచీన నగరానికి అమరావతి చిహ్నమని చంద్రబాబు తెలిపారు. దిల్లీలో అమరావతి ఐకాస నాయకులు అందరినీ కలుస్తున్నారని, విశాఖ ప్రజలు కూడా అధికార వికేంద్రీకరణ కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని కోరుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలకతీతంగా ఒకే మాట.. ఒకే రాజధాని ఉండాలని చంద్రబాబు ఆకాంక్షించారు.