రాజధాని అంశంపై ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డి స్పందించారు. విజయవాడలోని గేట్వే హోటల్లో ఏర్పాటు చేసిన ‘ది హిందూ ఎక్స్లెన్స్ ఇన్ ఎడ్యుకేషన్’ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘‘అమరావతి నిర్మాణానికి రూ.1.09లక్షల కోట్లు కావాలి. గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.5వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఓ వైపు రాయలసీమలో డ్యామ్లు నిండటం లేదు. నిధుల కొరత వల్లే వికేంద్రీకరణ నిర్ణయం. ఒక్క రాజధానికే కాకుండా ప్రాజెక్టుల పూర్తికి నిధులు ఖర్చు చేయాలి. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని పూర్తి చేయాలి. రాయలసీమతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ప్రయోజనం ఉండాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లున్నాయి… సద్వినియోగం చేసుకుంటాం. అవినీతి లేకుండా చేసేందుకు రివర్స్ టెండరింగ్ తీసుకొచ్చాం. రివర్స్ టెండరింగ్ ద్వారా అదే పని తక్కువ ధరలో పూర్తయ్యేలా చేస్తున్నాం. విశాఖలో మౌలిక వసతులన్నీ ఉన్నాయి. అమరావతిలో ఖర్చు చేసే నిధుల్లో 10 శాతం ఖర్చు చేస్తే సరిపోతుంది. ఏపీలో ఇప్పటికే అభివృద్ధి చెందిన నగరం విశాఖ. ఇంకా అభివృద్ధికి అవకాశం ఉంది. పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరుతో విశాఖ పోటీపడుతుంది. ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా అభివృద్ధి చేసుకోవచ్చు. అభివృద్ధి ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదు. ఉద్యోగాల కోసం భవిష్యత్ తరాలు వలస వెళ్లకూడదు. శాసన రాజధానిగా అమరావతి ఉంటుంది. అమరావతిలో అభివృద్ధి కొనసాగుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్రాభివృద్ధి కోసమే’’ అని సీఎం స్పష్టం చేశారు.
విశాఖలో అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలు
Related tags :