Politics

పొదుపు సంఘాలకు ₹6792 కోట్ల రుణమాఫీ నిధులు

పొదుపు సంఘాలకు ₹6792 కోట్ల రుణమాఫీ నిధులు

ఏపీలో వైఎస్సార్‌ ఆసరా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 8.71 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 87 లక్షల మంది మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ఏప్రిల్‌ 11, 2019 నాటికి పొదుపు సంఘాల్లో ఉన్న రుణాలను నాలుగు విడతల్లో చెల్లించనున్నారు. మొత్తం రూ.27,168 కోట్లను ఆయా సంఘాల ఖాతాల్లో జమ చేయనున్నారు. దీనిలో భాగంగా ఈరోజు తొలి విడతగా రూ.6,792 కోట్ల రుణమాఫీ నిధులను పొదుపు సంఘాలకు సీఎం జగన్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ డబ్బుతో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవాలని మహిళలకు సూచించారు. వ్యాపారాలు చేయాలనుకునే వారికి ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందిస్తామన్నారు. అలాంటి వారికి ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న పలు కంపెనీలు, బ్యాంకులతో అనుసంధానం చేస్తామని చెప్పారు. తక్కువ ధరలకు ఉత్పత్తులను అందించడంతోపాటు మార్కెటింగ్‌ చేసేందుకూ ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆసరా పథకాన్ని సీఎం ప్రారంభించిన అనంతరం ఆయా జిల్లాల్లో మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పొదుపు సంఘాల మహిళలకు చెక్కులు అందజేశారు.