Fashion

సేవారంగంపై అనుపమైన ప్రేమ

అనుపమ నాదెళ్ల… మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యనాదెళ్ల శ్రీమతిగానే అందరికీ తెలుసు! కానీ ఆమె తండ్రి కేఆర్‌ వేణుగోపాల్‌ ప్రధానమంత్రి కార్యాలయంలో ఉన్నత పదవుల్లో పనిచేసిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి. గ్రామీణ మహిళలని స్వయం ఉపాధి దిశగా నడిపిస్తే దేశం అభివృద్ధి బాట పడుతుందని బలంగా నమ్మేవారాయన. ఇదే విషయాన్ని తరచూ అనుపమతోనూ పంచుకునేవారు. ఆ స్ఫూర్తితోనే ఆమె అనంతపురం ఛత్తీస్‌గఢ్‌ సహా పలు ప్రాంతాల్లో మహిళలు, పిల్లల కోసం కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు…

నెర్రెలు విచ్చిన నేలలు.. చినుకు రాకకోసం దిగాలుగా ఎదురుచూసే రైతులు.. ఏళ్లు గడిచినా అనంతపురం ముఖచిత్రంలో పెద్దగా మార్పేమీ రాలేదు. సంవత్సరాల తరబడి ఉపాధిలేమితో కొట్టుమిట్టాడుతున్న ఆ ప్రాంత వాసులకు ప్రత్యామ్నాయ స్వయం ఉపాధి అవకాశాలని అందించే ప్రయత్నం చేస్తోంది ఆర్‌డీటీ(రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌). దాని అనుబంధ సంస్థే యాక్షన్‌ ఫ్రేటెర్నా ఎకాలజీ సెంటర్‌. ఫాదర్‌ విన్సెంట్‌ ఫెరర్‌ ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటివరకు వేలాది మంది రైతులూ, మహిళలకు ఉపాధి బాటలు చూపించింది. ముఖ్యంగా వాటర్‌షెడ్‌ మేనేజ్‌మెంట్‌, కరవు నివారణచర్యలు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ఈ సంస్థ కృషి చేస్తోంది. 40 వేలమంది మెట్ట రైతులు, రైతుకూలీలతో కలిసి పనిచేస్తోంది. దీనికి ఆకర్షితురాలైన అనుపమ నాదెళ్ల ఈ సంస్థతో కలసి తనూ సేవాబాట పట్టారు. ముఖ్యంగా మహిళలని వ్యవసాయేతర విభాగాల్లో ఉపాధివైపు నడిపించాలనేది ఆమె లక్ష్యం. మహిళలకు చిన్నవ్యాపారాలు, పాడిపరిశ్రమలు, గొర్రెల పెంపకం వంటి పనుల్లో శిక్షణ అందిస్తే కరవుని తట్టుకుని నిలబడతారనేది ఆమె అభిప్రాయం. ఇందుకోసం రెండుకోట్ల రూపాయలను సాయంగా అందించారామె. ఏఎఫ్‌ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ వైవీ మల్లారెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఈ రోజు ప్రారంభమయి… 2022 మార్చి వరకు కొనసాగుతాయి. అయితే గ్రామీణ భారత మహిళలకు ఏదో చేయాలనే ఆమె తపన ఈనాటిది కాదు. చిన్నతనంలోనే అనుపమ మెదడులో ఈ సేవాబీజాలు పడ్డాయి. ఆమె తండ్రి వేణుగోపాల్‌ పలుప్రాంతాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. అనంతపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మహిళలని స్వయంఉపాధి బాట పట్టించేందుకు కృషిచేశారు. ఉద్యోగరీత్యా ఆయన దేశమంతా పర్యటించాల్సి వచ్చింది. అప్పుడే దేశంలోని సమస్యలని అర్థం చేసుకునేందుకు తండ్రి సూచనలు మేరకు ‘ది ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ ఆఫ్‌ ఇండియా’ వంటి పత్రికలని చాలా ఆసక్తిగా చదివేవారు. పేదరికం, లింగవివక్ష, ఆర్థిక అసమానతలు వంటి విషయాలని తల్లిదండ్రులతో చర్చించేవారు. ఇలాంటి చర్చలు ఆయా సమస్యలపట్ల ఒక లోతైన అవగాహన తీసుకొస్తాయని నమ్మే అనుపమ తన పిల్లలతోనూ వీటిపై చర్చిస్తుంటారు.

ఏ పసిప్రాణానికి కష్టమొచ్చినా… ఆమె గుండె మెలిపెట్టినట్టవుతుంది. వాళ్లకోసం ఏదైనా చేయాలనే తపన ఆమెది. అమెరికాలోని ప్రఖ్యాత సియాటల్‌ పిల్లల ఆసుపత్రి, పరిశోధనా కేంద్రం కోసం గతకొన్నేళ్లుగా ఆమె స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ‘ఇట్‌ స్టార్ట్స్‌ విత్‌ ఎస్‌’ పేరుతో ఆ ఆసుపత్రి సేవలపై అవగాహన తీసుకురావడంతోపాటు, నిధుల సమీకరణా చేస్తున్నారు. ‘పిల్లల ఆరోగ్యం, అభివృద్ధి కోసం మనం కేటాయించే ప్రతిక్షణమూ ఎంతో విలువైంది. సియాటల్‌ ఆసుపత్రి పరిశోధనల్లో వేసే ప్రతి ముందడుగూ ఎంతోమంది పసిప్రాణాలకు అండగా ఉంటుంద’నే అనుపమ మనదేశంలో చిన్నారులకు సైతం తనవంతు సాయం అందించడం మొదలుపెట్టారు. అందుకే ఛత్తీస్‌గఢ్‌ రాజధాని నయారాయ్‌పూర్‌లో ఉన్న సత్యసాయి సంజీవని కేంద్రానికి తన అత్తమామలు మాజీ ఐఏఎస్‌ అధికారి యుగంధర్‌, ప్రభావతీ జ్ఞాపకార్థం రెండుకోట్ల రూపాయల సాయం అందించారు. సత్యసాయి సంజీవని పేరుకుతగ్గట్టుగానే వేలాదిమంది చిన్నారులకు అభయహస్తం ఇస్తోంది. ముఖ్యంగా చిన్నారుల్లో పుట్టుకతో తలెత్తే గుండెజబ్బులకు ఇక్కడ శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఒక్క మనదేశం నుంచే కాదు… పద్నాలుగుకు పైగా అభివృద్ధి చెందుతున్న దేశాల నుంచి వచ్చిన చిన్నారులు ఇక్కడ వైద్యసేవలు అందుకుంటున్నారు. వీటికి కొనసాగింపుగా ఈ ఏడాది జూన్‌ నుంచి ‘హీలింగ్‌ లిటిల్‌హార్ట్స్‌’ పేరుతో ఒక ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టారు అనుపమ. అందులో భాగంగా 132 మంది గుండెజబ్బులున్న చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు అందించాలనేది ఈ ప్రాజెక్ట్‌ లక్ష్యం. ఇప్పటివరకూ 65 మంది చిన్నారులు విజయవంతంగా శస్త్రచికిత్సలు పూర్తిచేసుకొని నవ్వుతూ ఇంటిబాట పట్టారు. గుండెలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఆసుపత్రిలో అడుగుపెట్టిన సూయాష్‌సాహు, సాయికుమార్‌ లెంక, ఊర్వశి వంటి ఎందరో చిన్నారులు ఇప్పుడు హాయిగా నవ్వుతూ ఇంటికెళ్లారు ‘తక్కినవారికి కూడా డిసెంబర్‌లోపు శస్త్రచికిత్సలు చేయిస్తాం’ అంటున్నారు అనుపమ.

కొవిడ్‌పై దేశం మొత్తం పోరాడుతుంది. ఈ క్రమంలో కేంద్రం, తెలంగాణ రాష్ట్రప్రభుత్వాలకు నాలుగు కోట్ల రూపాయలు అందించి అండగా నిలిచారు. కొవిడ్‌ సమయంలో వలస కార్మికుల ఆకలితీర్చేందుకు సంజీత్‌బంకర్‌రాయ్‌ ప్రారంభించిన తిలోనియా స్వచ్ఛంద సంస్థతోపాటూ… హైదరాబాద్‌లోని హెచ్‌కేఎమ్‌ ఫౌండేషన్‌కి తనవంతు సాయం అందించారామె. అనుపమ తమిళనాడులోని కళాక్షేత్ర, హైదరాబాద్‌లోని నాసర్‌స్కూల్‌, హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, దిల్లీలోని దిల్లీ పబ్లిక్‌స్కూల్‌లో విద్యాభ్యాసం చేశారు. తల్లి లక్ష్మీ వేణుగోపాల్‌ టీచర్‌ కావడంతో హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌కి ఇద్దరూ కలిసివెళ్లేవారు. మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఆర్కిటెక్చర్‌ చదువుకున్నారు. ఉన్నత విద్యకోసం బ్రిటిష్‌ కొలంబియా ఆర్కిటెక్చర్‌ కళాశాలలో అవకాశం వచ్చినా కుటుంబం కోసం చదువుకు దూరమయ్యారు. ఇప్పటికీ భారతీయ వంటకాలని ఎలా చేయాలో తెలుసుకోవడం కోసం తల్లికి ఫోన్‌ చేస్తుంటారు. జంతువులంటే ప్రాణం పెడుతుంటారు.