ప్రవాసం నుంచి ఉక్రెయిన్ సర్కారు?
పోలండ్లో ఉంటూ ప్రభుత్వాన్ని నడిపేలా ప్రణాళికలు.. వాషింగ్టన్ పోస్ట్ కథనంవాషింగ్టన్, మార్చి 6: అటుచూస్తే యుద్ధం కొనసాగింపు మీద రష్యా పట్టుదలగా ఉంది. దానితో పోలిస్తే బలహీన ఉక్రెయిన్ ప్రతిఘటన ఎంతమేరకు కొనసాగుతుందో చెప్పలేం. రాజధాని కీవ్పై ఇప్పటికే వారి పట్టుజారింది. ఈ క్రమంలో ఉక్రెయిన్ సైన్యంలో స్థైర్యం నింపేందుకు అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ కీలకం. అయితే, ఇప్పటికే ఆయనపై హత్యాయత్నాలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. దీంతో అమెరికా, బ్రిటన్.. ఓ హై రిస్క్ రెస్క్యూ ఆపరేషన్కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. జెలెన్స్కీని ప్రాణాపాయం నుంచి కాపాడి.. సరిహద్దు దేశం పోలండ్ నుంచి ఆయన పాలనతో పాటు యుద్ధాన్ని పర్యవేక్షించేలా చేయడం దీనివెనుక ఉద్దేశంగా కనిపిస్తోంది. అమెరికా ఉన్నతాధికార వర్గాలను ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ ప్రచురించిన కథనం ఇదే విషయం చెబుతోంది. ‘‘ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా తగిన వ్యూహాలను రూపొందిస్తున్నాం’’ అని ఆ వర్గాలు చెప్పినట్లు పేర్కొంది. ఆ కథనం ప్రకారం.. జెలెన్స్కీని రక్షించేందుకు అమెరికా నేవీ సీల్స్, బ్రిటన్ స్పెషల్ ఎయిర్ సర్వీస్ (ఎస్ఏఎస్) ప్రత్యేక కమాండోలతో కూడిన బృందాన్ని సిద్ధం చేస్తున్నారు. వీరు ఉక్రెయిన్ సైనికులతో కలిసి లిథువేనియాలోని ఓ రహస్య ప్రదేశంలో సమావేశమై ప్రణాళికలను చర్చించారు. కాగా, ఈ బృందంలో 150 మంది అమెరికా నేవీ సీల్స్, 70 మంది ఎస్ఏఎస్ సిబ్బంది ఉన్నట్లు సమాచారం. ఇక పోలండ్.. ఉక్రెయిన్ ప్రవాస ప్రభుత్వానికి సహాయపడేలా అమెరికా, యూకే చూసుకుంటాయి.
1.Russia వాయుసేన దాడుల్లో ఇద్దరు ఉక్రెయిన్ పౌరుల మృతి
ఉక్రెయిన్లోని క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా వాయుసేన సోమవారం క్షిపణి దాడి చేసింది.వాయుసేన జరిపిన దాడుల్లో ఇద్దరు పౌరులు మరణించారు. క్రమాటోర్స్క్ నగరంలోని నివాస భవనాలపై రష్యా క్రూయిజ్ క్షిపణి దాడి చేసింది. ఈ దాడిలో ఇద్దరు పౌరులు మరణించారని ఉక్రెయిన్ సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్స్ తెలిపింది.రష్యా యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్లో 38 మంది పిల్లలు మరణించారు. రష్యా సైనికుల దాడుల్లో మరో 71 మంది పిల్లలు గాయపడ్డారని ఉక్రెయిన్ పార్లమెంట్ మానవ హక్కుల కమిషనర్ లియుడ్మిలా డెనిసోవా తెలిపారు.ఖార్కివ్ మీదుగా రష్యా యుద్ధ విమానాన్ని ఉక్రెయిన్ సైన్యం కూల్చివేసినట్లు ఖార్కివ్ రీజియన్ డిఫెన్స్ హెడ్క్వార్టర్స్ తెలిపింది.న్యూయార్క్ నుంచి 50 మంది రష్యన్ దౌత్యవేత్తలు వారి కుటుంబ సభ్యులతో కలిసి న్యూయార్క్ నగరం నుంచి మాస్కోకు తిరిగి వచ్చినట్లు రష్యా వార్తా సంస్థ నివేదించింది.
2. Ukrain యుద్ధభూమిలో పెళ్లి గంటలు…
రష్యా భీకర కాల్పుల మధ్య ఉక్రెయిన్ యుద్ధభూమిలో పెళ్లి గంటలు మోగాయి. ఒక వైపు రష్యాతో యుద్ధం చేస్తున్న ఉక్రేనియన్ 112 బ్రిగేడ్కు చెందిన సైనికులు లెస్యా, వాలెరీలు యుద్ధభూమిలోనే వివాహం చేసుకున్నారు. ఉక్రెయిన్ దేశంపై రష్యా కాల్పులు జరుపుతున్నా, కాల్పుల మోత మధ్య ఉక్రేనియన్ యోధులైన లెస్యా, వాలెరీలు సంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. ఉక్రెనియా సైన్యంలో పనిచేస్తున్న లెస్యా, వాలెరీలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వరుడు యూనిఫాం ధరించి వివాహం ఆడారు. వధువు పుష్పగుచ్ఛం పట్టుకొని వరుడితో కలిసి హెల్మెట్లు మార్చుకున్నారు.ఒకవైపు వివాహం సాగుతుండగా, మరో వైపు రష్యా సైనికులు విన్నిట్సియా విమానాశ్రయాన్ని ధ్వంసం చేశారు.గత వారం మరో జంట క్లెవెట్స్, నటాలియా వ్లాడిస్లేవ్ ఉక్రెయిన్లోని ఒడెస్సా నగరంలోని బాంబు షెల్టర్లో వివాహం చేసుకున్నారు.
3. ఉక్రెయిన్లో జనావాసాలే లక్ష్యంగా రష్యా దాడులు
భారీ క్షిపణులు.. ఒక్కొక్క దాని బరువు 500 కిలోల దాకా ఉంటుంది..! ఉక్రెయిన్పై దురాక్రమణలో భాగంగా ప్రస్తుతం రష్యా ఇలాంటి క్షిపణులతో వైమానిక దాడులకు పాల్పడుతోంది. నగరాల్లో జనావాసాలు, గ్రామాలపైకి ఫ్యాబ్-500 వంటి మిసైల్స్తో విరుచుకుపడుతోంది. ఫలితంగా.. బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్లు, విద్యుత్తు వ్యవస్థ, రైల్వే మార్గాలు, రోడ్లు, వంతెనలు.. చివరకు ఆస్పత్రులు కూడా పెళపెళాకూలిపోతున్నాయి. పౌరులు బిక్కుబిక్కుమంటూ వలసబాట పడుతున్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం 11వ రోజు ప్రధాన నగరాలు, వాటి సమీప గ్రామాల్లో ఇవే పరిస్థితులు కనిపించాయి. ఉక్రెయిన్ సేనలు కూడా క్షేత్ర స్థాయిలో రష్యా దళాలను ధీటుగానే ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా.. తీర ప్రాంతాల్లో రష్యా స్వాధీనం చేసుకున్న పోర్టులపై పట్టుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ పోరులో.. బ్రిటిష్ రాయల్ మరైన్కు చెందిన మెరికెల్లాంటి మాజీ అధికారులు ఇప్పుడు ఉక్రెయిన్కు మద్దతుగా నిలిచారు. అమెరికా సైన్యానికి చెందిన సుమారు 16 వేల మంది మాజీలు కూడా ఉక్రెయిన్ పదాతిదళానికి అండగా ఉంటామని ప్రకటించారు. వీరంతా ఇరాక్, అఫ్ఘానిస్థాన్ తదితర యుద్ధాల్లో పాల్గొన్నవారే. వీరిలో మూడువేల మంది నేడో రేపో ఉక్రెయిన్కు రానున్నారు.
4. ఉక్రెయిన్పై వార్.. ఊహించినట్లే అడుగులు వేస్తున్న రష్యా!
ఉక్రెయిన్పై యుద్ధంలో మాస్కో వర్గాలు.. పాశ్చాత్య దేశాల ఊహకు తగ్గట్లే అడుగులు వేస్తున్నాయి. ప్రధాన నగరాలు, ఆపై అణు రియాక్టర్లు, అటుపై పోర్టు సిటీలు దాడులతో ఉక్రెయిన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అమెరికా నిఘా వర్గాలు ఊహించినట్లే మరొకటి జరిగింది. రెండు దేశాల మధ్య యుద్ధం 12వ రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో.. ఉక్రెయిన్ పై యుద్ధం చేయడానికి ఇతర దేశాల ఫైటర్లను రష్యా నియమించుకుంటోంది. ఉక్రెయిన్ ను ఆక్రమించుకునే లక్ష్యంతో చేస్తున్న యుద్ధంలో రష్యా భారీ విధ్వంసానికి దిగినప్పటికీ.. ఉక్రెయిన్ దళాల నుంచి ప్రతిఘటనే ఎదురవుతోంది. రష్యా సైన్యం భారీగా నష్టపోతోంది. ఇప్పటికే ఎంతో మంది రష్యన్ సైనికులను ఉక్రెయిన్ బలగాలు చంపేశాయి. మరెందరో రష్యన్ సైనికులు ఉక్రెయిన్ కు బంధీలుగా చిక్కారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సైతం బయటకు వచ్చాయి.ఇక రష్యా కాంట్రాక్ట్ ఫైటర్లను నియమించుకుంటున్న విషయాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో వెల్లడించింది. నలుగురు అమెరికా అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించినట్లు సదరు కథనం పేర్కొంది. సిరియాతో పాటు చెచెన్యా ఫైటర్లను ఇప్పటికే నియమించుకుందట రష్యా. ఇందుకోసం ఫైటర్లతో ఆరు నెలల ఒప్పందాన్ని సైతం కుదుర్చుకున్నట్లు సమాచారం. రోజూ 200 నుంచి 300 డాలర్ల జీతం వీళ్లకు ముట్టజెప్పనుంది రష్యా. రాజధాని కీవ్ ముట్టడి కోసమే ఈ నియామకాలని అమెరికా అధికారులు భావిస్తున్నారు.ఇక ఈ ప్రైవేట్ ఫైటర్లు నగరాల ముట్టడిలో రాటుదేలిన వాళ్లని సమాచారం. అయితే ఇప్పటి వరకు ఎంత మందిని, ఈ రెండు దేశాల నుంచే కాకుండా వేరే దేశాల నుంచి కూడా నియమించుకుందా? అనే సమాచారం మాత్రం వెల్లడించలేదు సదరు కథనం. మరోవైపు ఈ యుద్ధంలో రష్యా గనుక సిరియా సాయం తీసుకుంటే.. తాము ఉక్రెయిన్కు మద్ధతుగా రంగంలోకి దిగుతామని సిరియా రెబెల్స్ ఇప్పటికే ప్రకటించేశారు.
5. ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడనున్న మోదీ!
ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ల మధ్య పూర్తిస్థాయి యుద్ధం జరిగిన నేపథ్యంలో ఫిబ్రవరి 26న భారత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా జెలెన్స్కీతో మాట్లాడారు. తదనంతరం మోదీ మళ్లీ ఈ రోజు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్ స్కీతో మాట్లాడే అవకాశం ఉందని భారత ప్రభుత్వ అధికారిక వర్గాలు తెలిపాయి.ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్కు భారతదేశం గైర్హాజరైన తర్వాత, జెలెన్స్కీ ప్రధాని మోదీతో సంభాషించడమే కాక భారతదేశ రాజకీయ మద్దతును కూడా కోరారు. ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకుపోయిన భారతీయులను తరలించడానికి కేంద్రం ఆపరేషన్ గంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అంతేగాదు భారతీయ పౌరులను సురక్షితంగా నిష్క్రమించడానికి ఇప్పటికే ఉక్రెయిన్ను భారత్ సంప్రదించింది కూడా.
6. ఉక్రెయిన్లోని భారత పౌరులకు ఎంబసీ కీలక సూచన.. అర్జెంట్గా డాక్యుమెంట్లో పూర్తి వివరాలను..
ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు పది రోజులుగా యుద్ధం జరుగుతోంది. దీంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడం కోసం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ గంగా’ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఉక్రెయిన్లోని ఇండియన్ ఎంబసీ ట్విట్టర్ ద్వారా అక్కడ చిక్కుకున్న భారతీయులను ఉద్దేశించి కీలక ప్రకటన చేసింది. ట్విట్టర్లో షేర్ చేసిన గూగుల్ డాక్యుమెంట్లో పూర్తి వివరాలను పేర్కొని దాన్ని సబ్మిట్ చేయాలని సూచించింది. ఉక్రెయిన్లోని భారతీయులందరూ సాధ్యమైనంత త్వరగా ఈ పని పూర్తి చేయాలని వెల్లడించింది. దీని ద్వారా ఉక్రెయిన్లో ఇంకా ఎంత మంది భారతీయులు ఉన్నారనే విషయంపై స్పష్టత వస్తుందని అభిప్రాయపడింది. ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్లో చిక్కకున్న భారత పౌరులను ఇండియాకు తరలించడంలో భాగంగా హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ఇండియన్ ఎంబసీ ఒక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది.
7. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ప్రధాని మోదీ ఫోన్
ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు జెలెన్తో మాట్లాడారు. ఇరు నేతలు ఉక్రెయాన్లో ప్రస్తుత పరిస్థితులపై చర్చించారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించడానికి సహకరించినందుకు జెలెన్స్కీకి మోదీ కృతజ్ఞతలు తెలిపినట్లు సమాచారం. అలాగే ఇప్పటికి మిగిలిపోయిన భారతీయులను సుమీ నుంచి తరలించేందుకు సహకరించాలని జెలెన్స్కీని మోదీ కోరారు.‘ఆపరేషన్ గంగ’ పేరుతో ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇప్పటిదాకా ఉక్రెయిన్ నుంచి 76 విమానాల్లో 15,920 మంది భారతీయులు స్వదేశానికి చేరవేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అటు కీవ్లోని భారత రాయబార కార్యాలయం ఓ ‘ముఖ్యమైన ప్రకటన’ను జారీ చేసింది. ఉక్రెయిన్లో సొంత ఆవాసాల్లో ఉన్న భారతీయులు ఆదివారం ఉదయం 10 గంటల్లోపు (స్థానిక కాలమానం ప్రకారం) హంగరీ రాజధాని బుడాపె్స్టలోని ‘హంగరియా సిటీ సెంటర్’కు చేరుకోవాలని సూచించింది. తమ అధికారిక ట్విటర్ ఖాతాలో ఓ గూగుల్ దరఖాస్తును పోస్ట్ చేశామని.. ఇంకా ఉక్రెయిన్లోని యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులంతా తమ వివరాలను వెంటనే అందులో పొందుపర్చాలని సూచించింది.
8. ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఉక్రెయిన్-రష్యాలు చర్చలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్తో రెండు సార్లు చర్చలు జరిపిన రష్యా.. మరోసారి చర్చలకు సిద్ధమైంది. సోమవారం మూడో విడత చర్చలు జరగనున్నాయి.ఉక్రెయిన్పై రష్యా జరుపుతున్న భీకర దాడులను ప్రపంచ దేశాలే కాదు చాలా మంది రష్యన్లు కూడా తప్పుపట్టారు. యుద్ధాన్ని వెంటనే ఆపేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలా వ్యతిరేకంగా ఆందోళన చేపట్టడంపై రష్యా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు 4,300 మంది నిరసనకారులను అరెస్ట్ చేసింది.మరోవైపు సామాజిక మాధ్యమాలు కూడా రష్యా ఆంక్షల కారణంగా తమ కార్యకలాపాలను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. తమ యాప్లో లైవ్ స్ట్రీమింగ్ సహా కొత్తగా వీడియోలను చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్టాక్ ప్రకటించింది. ఇటీవల ప్రభుత్వం ఫేక్న్యూస్ చట్టం ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.
9. ఉక్రెయిన్ నుంచి రాలేను.. నా ప్రాణం కంటే చిరుత పులుల ప్రాణాలే ముఖ్యం’
ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దురాక్రమణ దాడి కారణంగా వేలాదిమంది ఉక్రెయిన్ వాసుల, విదేశీయులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వలసల బాట పట్టారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రభుత్వం కూడా ఆపరేషన్ గంగా సాయంతో ఉక్రెయిన్లో చిక్కుకున్న తమ పౌరులను, విద్యార్థులను తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగిస్తోంది.ఇప్పటికే చాలా మంది పౌరులను తరలించింది కూడా. ఈ క్రమంలో కొంతమంది బంకర్ల ఉన్నాముంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో విదేశాంగ కార్యాలయం రష్యాతో సంప్రదింపుల జరిపి వారిని తరలించే ప్రయత్నాలు కూడా చేసింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన డాక్టర్ గిరి కుమార్ పాటిల్ ఉక్రెయిన్లోని డాన్బాస్లో చిక్కుకున్నాడు. ఆయన మెడిసిన్ చదవడానికి 15 ఏళ్ల క్రితం ఉక్రెయిన్ వెళ్లాడు. ఆ తర్వాత డాన్బాస్లో స్థిరపడ్డారు.ప్రస్తుతం అతను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్థోపెడిక్గా పనిచేస్తున్నారు. అయితే అతని వద్ద రెండు చిరుత పులులు ఉన్నాయి. అయితే వాటిని వదిలి తాను రాలేనని అంటున్నాడు. తన ప్రాణం కోసం పెంపుడు జంతువులను వదులుకోలేను అని చెబుతున్నాడు. ప్రస్తుతం అతను తన పులులతో కలిసి బంకర్లలో తలదాచుకుంటున్నాడు. వాటి ఆహారం కోసం మాత్రమే బయటకు వస్తున్నట్లుగా చెబుతున్నాడు.అంతేకాదు తన పెంపుడు జంతువులన్నింటినీ ఇంటికి తీసుకెళ్లడానికి భారత ప్రభుత్వం అనుమతిస్తుందని ఆశిస్తున్నాని డాక్టర్ పాటిల్ చెప్పారు. ఇలాగే గత వారం, భారతీయ విద్యార్థి రిషబ్ కౌశిక్ తన పెంపుడు కుక్కతో వచ్చేందుకు భారత ప్రభుత్వం అనుమతివ్వాలని అభ్యర్థించాడు. దీంతో అతను కేంద్ర ప్రభుత్వ చేపట్టిన ఆపరేషన్ గంగా సాయంతో తన పెంపుడు కుక్కతో సహా భారత్కి సురక్షితంగా తిరిగి వచ్చాడు
10. కష్టమైనా నష్టమైనా నా భార్యతోనే.. యుద్ధం వేళ ఎన్నారై ఉక్కు సంకల్పం
యుద్ధం కొనసాగుతోంది. బాంబుల మోతతో చెవులు దద్దరిల్లుతున్నాయి. ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చనే భయం వెంటాడుతోంది. కానీ గుండెల్లో నిండిన ప్రేమ ముందు ఇవన్నీ బలాదూర్ అయ్యాయి. భారతీయుడై గగన్ ఉక్రెయిన్లో స్థిరపడ్డాడు. అక్కడి స్థానిక మహిళను పెళ్లాడాడు. ప్రస్తుతం ఆమె 8 నెలల గర్భవతి. అయితే అనుకోకుండా వచ్చిన యుద్ధంతో ఆ కుటుంబం చిక్కుల్లో పడింది. బాంబుల మోత, తుపాకుల గర్జన మధ్య బిక్కుబిక్కుమంటూ ఉక్రెయిన్లో గడుపుతోంది.ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను సురక్షితంగా స్వదేశం తీసుకువచ్చేందుకు ఇండియా ఆపరేషన గంగాను చేపట్టింది. ఉక్రెయిన్లో వివిధ ప్రాంతాల్లో ఇండియన్లను పొరుగున్న ఉన్న రొమేనియా, పొలాండ్, స్లోవేకియా, హంగేరిల మీదుగా ఇండియాకి వస్తున్నారు. ఈ క్రమంలో భారత అధికారులను గగన్ కలిశాడు.ఆపరేషన్ గంగలో కేవలం భారతీయులకే అవకాశం ఉందని భారత అధికారులు చెప్పారు. ఉక్రెయిన్ వణిత అయిన అతని భార్యను తరలించేందుకు నిబంధనలు అంగీకరించవని చెప్పారు. గగన్ ఒక్కడితే ఇండియాకు తరలిస్తామన్నారు. కష్టకాలంలో గర్భవతిగా ఉన్న భార్యను వదిలి వచ్చేందుకు నిరాకరించాడు గగన్. కష్టమైనా నష్టమైనా ఆమెతోనే ఉంటానంటూ ఆపరేషన్ గగన్ అధికారులకు చెప్పాడు.రోజులు గడుస్తున్నా.. ఎంతకీ యుద్ధం ఆగకపోకపోవడంతో గర్భవతిగా ఉన్న భార్యతో కలిసి కీవ్ నగరాన్ని గగన్ వీడాడు. ప్రస్తుతం పశ్చిమ దిక్కున ఉన్న లివివ్ నగరంలో స్నేహితుడి ఇంట్లో ప్రస్తుతం గగన్ , అతని భార్య ఆశ్రయం పొందుతున్నారు. త్వరలోనే తాము పోలాండ్ వెళ్లిపోతామంటూ చెబుతున్నాడు గగన్.
11. ఉక్రెయిన్కు బాసటగా మెనూ నుంచి రష్యన్ సలాడ్ తొలగించిన కేరళ కేఫ్
ఉక్రెయిన్పై రష్యా దాడులకు నిరసనగా ఉక్రెయిన్కు సంఘీభావం తెలుపుతూ రష్యన్ సలాడ్ను మెనూ నుంచి తొలగించాలని ఓ కేరళ కేఫ్ నిర్ణయించింది. ఫిబ్రవరి 24న ఉక్రెయిన్పై మాస్కో దండయాతక్రకు నిరసనగా పలు దేశాలు ఇప్పటికే రష్యాపై ఆంక్షలు విధించాయి.ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి తెగబడటాన్ని నిరసిస్తూ కొచ్చిలోని కశి ఆర్ట్ కేఫ్ అండ్ గ్యాలరీ తన మెనూ నుంచి రష్యన్ సలాడ్ను తొలగించింది. పోర్ట్ కొచ్చిలోని రెస్టారెంట్ బయట తమ మెనూ నుంచి రష్యన్ సలాడ్ను తొలగించామనే మెసేజ్ను కేఫ్ పోస్ట్ చేసింది. మెసేజ్ బోర్డ్ ఫోటోగ్రాఫ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఆన్లైన్లో చర్చకు దారితీసింది.యుద్ధాన్ని ఖండిస్తూ తాము ఈ తరహాలో నిరసన ప్రదర్శించామని కేఫ్ యజమాని ఎద్గర్ పింటో పేర్కొన్నారు. కళా ప్రేమికులుగా తాము భావప్రకటనా స్వేచ్ఛను విశ్వసిస్తామని తాము ఈ రకంగా ఉక్రెయిన్ ప్రజలకు మద్దతు తెలుపుతున్నామని చెప్పుకొచ్చారు. కేరళ కేఫ్ నిర్ణయాన్ని పలువురు నెటిజన్లు స్వాగతించగా మెనూ నుంచి రష్యన్ సలాడ్ తొలగించడాన్ని మరికొందరు తప్పుపట్టారు.
12. జెలెన్స్కీ చనిపోతే?.. ఉక్రెయిన్ వద్ద ప్లాన్ ఉందంటున్న అమెరికా
ఉక్రెయిన్ అధ్యక్షుడు చనిపోతే ఏం జరుగుతుంది? అనే ప్రశ్నకు అగ్రరాజ్యం అమెరికా సమాధానం చెప్పింది. వాళ్ల అధ్యక్షుడు చనిపోయినా కూడా ప్రభుత్వం కొనసాగేలా ఉక్రెయిన్ చర్యలు తీసుకుందని అమెరికా యూఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటనీ బ్లింకెన్ చెప్పారు. జెలెన్స్కీ లేకపోయినా కూడా ఉక్రెయిన్కు అమెరికా సహకారం అందిస్తుందా? అని ప్రశ్నించగా బ్లింకెన్ ఈ సమాధానం ఇచ్చారు.రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైన తర్వాత మూడు సార్లు జెలెన్స్కీని చంపే ప్రయత్నాలు జరిగాయని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల అమెరికా నేతలతో మాట్లాడిన జెలెన్స్కీ తనను ప్రాణాలతో చూడటం అదే చివరిసారి అవ్వొచ్చని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే జెలెన్స్కీ చనిపోయినా ఉక్రెయిన్ ప్రభుత్వం కొనసాగేందుకు చర్యలు సిద్ధం అయ్యి ఉన్నాయని బ్లింకెన్ చెప్పారు.జెలెన్స్కీ, అతని ప్రభుత్వం చూపించిన తెగువను మెచ్చుకున్న బ్లింకెన్.. రష్యాపై విధించిన ఆంక్షలు ప్రభావం చూపుతున్నాయని, ప్రజలు నిత్యావసర వస్తువులు కూడా కొనుగోలు చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కానీ పుతిన్ మొండితనం కారణంగా ఈ పరిస్థితి మరికొంత కాలం కొనసాగేలా కనిపిస్తోందని పేర్కొన్నారు.
13. రష్యాతో స్నేహం ధృడంగా ఉంది.. అందుకు సిద్ధంగా ఉన్నాం: చైనా
రష్యా-చైనా మధ్య స్నేహం ఇప్పటికీ చాలా ధృడంగా ఉందని చైనా విదేశాంగశాఖ మంత్రి వాంగ్ యూ సోమవారం స్పష్టం చేశారు. మాస్కో-బీజింగ్ మధ్య మంచి స్నేహం ఉందని, చైనా-రష్యా సంబంధాన్ని ప్రపంచంలోని అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సంబంధంగా ఆయన అభివర్ణించాడు. అవసరమైతే ఇరు దేశాల శాంతి పునరుద్ధరణ కోసం మధ్యవర్తిత్వంపై పనిచేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. అయితే ఉక్రెయిన్పై రష్యా యుద్ధాన్ని ప్రపంచ దేశాలు ఖండిస్తున్నన నేపథ్యంలో చైనా మాత్రం రష్యాతో తమకు బలమైన స్నేహం కొనసాగుతోందని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అదే విధంగా ఉక్రెయిన్కు మానవతా సహాయాన్ని అందిస్తున్నామని వాంగ్ తెలిపారు. అయితే గత వారం యూరోపియన్ యూనియన్ విదేశాంగ విధాన చీఫ్ జోసెప్ బోరెల్ మాట్లాడుతూ.. రష్యా ఉక్రెయిన్ మధ్య భవిష్యత్తులో శాంతి చర్చలకు చైనా మధ్యవర్తిత్వం వహించాలని తెలిపారు. చైనా మధ్యవర్తిత్వం వహిస్తే పరిస్థితులు చక్కదిద్దుకుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అనేక దేశాల ప్రతినిధులు సైతం ఈ విషయాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ఇరు దేశాల మధ్య యుద్ధం పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలపై ఆర్థిక భారంతో పాటు ఎన్నో సమస్యలు తలెత్తుతాయని, వీలైనంత తొందరలో ఇరు దేశాల మధ్య శాంతిని నెలకొల్పాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే రష్యా-ఉక్రెయిన్ మధ్య మధ్యవర్తిత్వానికి చైనా ముందుకు వచ్చినప్పటికీ.. ఈ ప్రతిపాదనపై ఉక్రెయిన్ ఇప్పటి వరకు ఏ విధంగానూ స్పందించలేదు.