Politics

పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు వాహనశ్రేణి రెడీ..!

పవన్ కల్యాణ్ రాష్ట్ర పర్యటనకు వాహనశ్రేణి  రెడీ..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయదశమి నుంచి రాష్ట్ర పర్యటన చేపట్టనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన వాహనశ్రేణిని సిద్ధం చేశారు. ఎనిమిది కొత్త స్కార్పియో వాహనాలను పవన్ పర్యటన కోసం కొనుగోలు చేశారు. అవి ఇవాళ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి.రాష్ట్ర పర్యటనకు సన్నద్ధమవుతున్న జనసేనానికి పవన్ కల్యాణ్ కొత్త వాహనశ్రేణి సిద్ధమవుతోంది. ఎనిమిది నలుపు రంగు స్కార్పియో వాహనాలను పవన్ పర్యటన కోసం సిద్ధం చేశారు. ఈ నూతన వాహనాలు ఇవాళ పార్టీ కార్యాలయానికి చేరుకున్నాయి. పవన్ పర్యటనకు ఈ వాహనాలను వినియోగించనున్నారు. వీటికి పూజ కార్యక్రమాలు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

విజయదశమి నుంచి పర్యటన: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అక్టోబరు 5 విజయదశమి రోజున తిరుపతి నుంచి పర్యటన ప్రారంభించి వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రకటించారు. దసరా రోజున ప్రారంభించి ఆరు నెలల్లో రాష్ట్రమంతా పర్యటించటంతో పాటు, ప్రతి ఉమ్మడి జిల్లాలోనూ బహిరంగసభలు నిర్వహించనున్నట్టు జనసేన నేతలు పేర్కొన్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటనలు ఉండేలా రూట్‌మ్యాప్‌ రూపొందిస్తున్నారు.వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్‌లోనే ఎన్నికలు ఉంటాయనే సంకేతాలు వస్తున్నందున రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలకు పెద్దగా సమయం లేదని, ఇప్పటినుంచే నాయకులు సన్నద్ధం కావాలనేది పవన్‌ అభిప్రాయం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఇప్పటికే ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అందులో భాగంగా రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు.