ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ భార్య సాధనా గుప్తా శనివారం మరణించారు. కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో ఆమె బాధపడుతున్నారు. గత నాలుగు రోజులుగా గురుగ్రామ్లోని మేదాంత ఆసుపత్రిలో సాధన చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం క్షిణించడంతో ఐసీయూకు తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు శనివారం తెలిపారు. ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధనా గుప్తా . ఆమె కుమారుడు ప్రతీక్ యాదవ్. బీజేపీలో చేరిన అపర్ణా యాదవ్ ఆమె కోడలు.మరోవైపు ములాయం సింగ్ యాదవ్ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య సంతాపం తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ సతీమణి సాధనా గుప్తా మృతి చెందారనే బాధాకరమైన వార్త తెలిసింది. భగవంతుడి పాదాల చెంత ఆమె పవిత్ర ఆత్మకు చోటు కల్పించాలని ప్రార్థిస్తున్నాను. ములాయం సింగ్, ఆయన కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.