వచ్చే పాతికేళ్లలో భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణం 13 రెట్లు పెరగనుందని.. 2047 నాటికి జీడీపీ 40 లక్షల కోట్ల డాలర్లకు (రూ.3280 లక్షల కోట్లు) చేరుకోవచ్చని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు. శుద్ధ ఇంధనం, బయో ఇంధనం, డిజిటలీకరణ విప్లవాలు ఆర్థిక వృద్ధికి ప్రధాన చోదకాలు కానున్నాయని పండిత్ దీన్దయాళ్ ఎనర్జీ యూనివర్సిటీలో మంగళవారం జరిగిన 10వ స్నాతకోత్సవ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. ‘‘భారత్ 3 లక్షల కోట్ల డాలర్ల నుంచి 2047 నాటికి 40 లక్షల కోట్ల డాలర్లకు పెరిగి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది’’ అన్నారు. వందేళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలు నిర్వహించుకోనున్న భారత్కు 2047 వరకు అమృత కాలమని.. అసాధారణ వృద్ధి, అవకాశాలను పంచనుందన్నారు. ఆసియా కుబేరుడు గౌతమ్ అదానీతో పోలిస్తే అంబానీ దేశీయ ఆర్థిక వ్యవస్థపై మరింత ఆశావహ దృక్పథం వ్యక్తం చేశారు. దేశీయ వినియోగ సామర్థ్యం, సామాజిక ఆర్థిక సంస్కరణల దన్నుతో మన ఎకానమీ 2050 నాటికి 30 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోవచ్చని ఈమధ్యనే ఓ కార్యక్రమంలో గౌతమ్ అదానీ అంచనా వేశారు.
హరిత ఇంధన పరివర్తనానికి భారత నాయకత్వం
సంప్రదాయ ఇంధనాల నుంచి హరిత, శుద్ధ ఇంధనాలకు మారడం తప్పనిసరని స్నాతకోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ అన్నారు. హరిత ఇంధన పరివర్తనానికి భారత్ నాయకత్వం వహించగలదన్నారు. సాంకేతిక పురోగతి ఇంధన పరివర్తనాన్ని మరింత అందుబాటులోకి తేగలగాలన్నారు. ఏ వ్యాపార లేదా పరిశ్రమ భవిష్యత్తైనా డేటాపైనే ఆధారపడి ఉందన్నారు. సాంకేతిక రంగ పురోగతులు రియల్ టైం డేటాను మరింత సులభంగా, చౌకగా అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.
చంద్రపై ప్రశంసల వర్షం
టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్పై అంబానీ ప్రశంసల వర్షం కురిపించారు. గడిచిన కొన్నేళ్లలో చంద్రశేఖరన్ టాటా గ్రూప్ను అద్భుతమైన వృద్ధిపథంలో నడిపించారని ఆయన పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో టాటాగ్రూప్ పునరుత్పాదక ఇంధన రంగంలో కనబర్చిన అనూహ్య వృద్ధి స్ఫూర్తిదాయకమన్నారు. వ్యాపార సమాజం, యువతకు ఆయన ఆదర్శప్రాయుడని అన్నారు.