Politics

ISRO:ఇస్రో నంబి నారాయణ్‌ పై కుట్ర కేసు సుప్రీంకోర్టు కీలక తీర్పు

ISRO:ఇస్రో నంబి నారాయణ్‌ పై కుట్ర కేసు సుప్రీంకోర్టు కీలక తీర్పు

దిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గూఢచర్యం కేసులో సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. గూఢచర్యం వ్యవహారంలో శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ను ఇరికించారన్న కేసులో మాజీ డీజీపీ సహా నలుగురు నిందితులకు కేరళ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.
ఈ కేసును తిరిగి హైకోర్టుకే బదిలీ చేస్తున్నామని.. దీనిపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది.1994లో క్రయోజనిక్‌ ఇంజిన్‌ తయారీకి సంబంధించిన కీలక పత్రాలను శాస్త్రవేత్త నంబి నారాయణ్‌ విదేశీయులకు అప్పగించారంటూ కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం న్యాయస్థానం ఈ కేసును కొట్టివేసింది. క్రయోజనిక్‌ ఇంజిన్‌ పనులు ఆలస్యం కావాలన్న విదేశీ కుట్రలో భాగంగానే కేరళ పోలీసులు నంబి నారాయణ్‌పై ఈ ఆరోపణలు చేశారంటూ సీబీఐ కేసు నమోదు చేసింది. అప్పటి పోలీసు అధికారులైన గుజరాత్‌ మాజీ డీజీపీ ఆర్‌.బి.శ్రీకుమార్‌, విశ్రాంత నిఘా అధికారి పి.ఎస్‌.జయ్‌ప్రకాశ్‌, ఇద్దరు పోలీసు అధికారులు ఎస్‌.విజయన్‌, థంపి ఎస్‌ దుర్గా దత్‌పై కేసులు పెట్టింది. అయితే వారికి కేరళ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.
దీంతో హైకోర్టు తీర్పుపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నంబి నారాయణ్‌పై కేసు పెట్టడం ద్వారా క్రయోజనిక్‌ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని, రోదసీ కార్యక్రమాలు ఒకటి, రెండు దశాబ్దాల పాటు వెనకబడ్డాయని సీబీఐ వాదించింది. ఇది చాలా త్రీవమైన అంశమని, విదేశీ కుట్రలో భాగస్థులయి పోలీసులు ఇలా చేసి ఉండవచ్చని తెలిపింది. నిందితులకు బెయిల్‌ ఇస్తే.. విచారణకు ఆటంకం కలుగుతుందని పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ ఎం.ఆర్‌. షా, జస్టిస్‌ సి.టి. రవికుమార్‌ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.
”సీబీఐ అప్పీళ్లను అంగీకరిస్తున్నాం. ఈ కేసులో నిందితులకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం. ఈ కేసుకు సంబంధించిన అన్ని పిటిషన్లను తిరిగి హైకోర్టుకే పంపిస్తున్నాం. నిందితుల బెయిల్‌ దరఖాస్తులను మళ్లీ మొదటి నుంచి విచారించండి. నాలుగు వారాల్లోగా దీనిపై తీర్పు వెలువరించండి” అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశించింది. అయితే ముందస్తు బెయిల్‌ దరఖాస్తులపై కోర్టు తీర్పు వెలువరించేదాకా నిందితులను అరెస్టు చేయకుండా వారికి రక్షణ కల్పించింది.