Business

నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 17,750 దిగువకు నిఫ్టీ

నష్టాల్లోనే మార్కెట్ సూచీలు.. 17,750 దిగువకు నిఫ్టీ

వడ్డీరేట్ల పెంపు భయాలు మార్కెట్లను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. దేశీయ సూచీలు ఈరోజు నష్టాలతో ట్రేడింగు ప్రారంభించాయి.

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock Market) బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. వడ్డీరేట్ల పెంపు భయాలు మార్కెట్లను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి.ఉదయం 9:22 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex)302 పాయింట్ల నష్టంతో 60,370 దగ్గర ట్రేడవుతోంది.
నిఫ్టీ (Nifty) 87 పాయింట్లు నష్టపోయి 17,739 దగ్గర కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.82 దగ్గర ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో
ఒక్క సన్ఫార్మా మాత్రమే లాభాల్లో ఉంది. విప్రో,అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫినసర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్,హెచ్సీఎల్ టెక్, బజాజ్ ఫైనాన్స్, పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, టెక్ మహీంద్రా, ఎన్టీపీసీ, హెచ్ఐఎఫ్సీ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి.ఫిబ్రవరిలో యూఎస్ వ్యాపార కార్యకలాపాలు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. దీంతో వడ్డీరేట్ల పెంపు సుదీర్ఘకాలం కొనసాగొచ్చనే అంచనాలు మార్కెట్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఆసియా- పసిఫిక్ సూచీలు
నేడు ప్రతికూలంగా ట్రేడవుతున్నాయి. మంగళవారం బ్రెంట్ చమురు బ్యారెల్ ధర 1 శాతానికి పైగా పతనమైంది.మాంద్యం భయాల నేపథ్యంలో వృద్ధి క్షీణించి చమురుకు గిరాకీ తగ్గొచ్చనే అంచనాలు ధరలు తగ్గడానికి కారణమయ్యాయి.