Business

విప్రో కు ఎంపికైన ఉద్యోగుల్లో ఆందోళన

విప్రో కు ఎంపికైన ఉద్యోగుల్లో ఆందోళన

ఆర్థిక మాంద్యం పరిస్థితులు టెక్, ఐటీ కంపెనీలను అయోమయంలో పడేస్తున్నాయి. దీంతో గతేడాది పెద్ద ఎత్తున దిగ్గజ ఐటీ సంస్థలు ఫ్రెషర్స్ (IT Freshers) ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అంతకంటే దారుణంగా వారికి వేరే మెయిల్స్ పంపిస్తుందంట. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ అసలేం జరుగుతుందంటే?

భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఉద్యోగులకు (IT Employees) అత్యంత కష్ట కాలం నడుస్తోంది. ఆర్థిక మాంద్యం భయాల నడుమ కంపెనీలు.. ఉద్యోగులను తీసేస్తున్నాయి కూడా. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఉద్యోగులను వేలాదిగా తీసేశాయి. దీంతో.. ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే చేస్తున్నాయి. భారత ఐటీ దిగ్గజాలు.. ఉద్యోగులు ఫేక్ పెట్టారనో, ఇంటర్నల్ అసెస్‌మెంట్ టెస్టుల్లో (Assessment Tests) పాస్ కాలేదనో ఉద్యోగులను తొలగించిన ఉదంతాలు గతేడాది చూశాం. ఇటీవల కూడా ఇన్ఫోసిస్, విప్రో కూడా అలానే చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇక గతేడాది.. చాలా మంది ఫ్రెషర్లకు ఆఫర్ లెటర్స్ ఇచ్చి.. ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం జరుగుతుందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనిపై విప్రో కంపెనీకి సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది.

ఆన్‌బోర్డింగ్‌లో జాప్యం (Onboarding Delay) జరుగుతుందన్న ఆరోపణల నడుమ ఇప్పుడు ఆ అపవాదును తొలగించుకునేందుకు విప్రో.. ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఫ్రెషర్లకు మళ్లీ మెయిల్స్ పంపుతోంది. అయితే వేతనాలు తగ్గించుకుంటే తమను చేర్చుకుంటామని చెబుతుండటం గమనార్హం. అప్పట్లో ఏడాదికి 6.5 లక్షల ప్యాకేజీతో ఆఫర్ లెటర్స్ ఇచ్చిన వారికి రూ.3.5 లక్షలు ఇస్తామని, అలా అయితే వచ్చి చేరొచ్చని ప్రతిపాదనలు పంపుతోంది. ఏకంగా సగానికి సగం వేతనాల్లో కోత విధిస్తుండటం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత డిమాండ్, మార్జిన్ ఒత్తిళ్లు, ఆర్థిక మాంద్యం భయాల నడుమ విప్రో.. 2022 గ్రాడ్యుయేట్ బ్యాచ్‌కు ఆన్‌బోర్డింగ్‌‌ను చాలా రోజుల పాటు నిలిపివేసింది. గత ఆగస్టు నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆఫర్ లెటర్స్ చేతులో ఉన్నా.. ఉద్యోగంలో చేరలేక ఎన్నో రోజులు కళ్లరిగేలా ఎదురుచూశారు ఫ్రెషర్లు. ఇప్పుడు వారికి జీతం తగ్గించుకుంటే, చేర్చుకుంటామని చెబుతున్నాయి. తాజాగా ఫిబ్రవరి 16న తమకు విప్రో నుంచి మెయిల్స్ వచ్చినట్లు కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. కొత్త ఆఫర్‌ను అంగీకరిస్తే.. పాత ఆఫర్ చెల్లుబాటు కాదని చెప్పుకొచ్చిందంట. దీంతో తక్కువ వేతనానికి చేరాలా? లేదా వేరే ఉద్యోగం చూసుకోవాలా? అన్న సందిగ్ధంలో ఉన్నారు.

విప్రో ఇటీవల వేరియబుల్‌ పే పై కీలక ప్రకటన చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి సంబంధించి అందరు ఉద్యోగులకు 87 శాతం వేరియబుల్ పే విడుదల చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇది కంపెనీ పనితీరు ఆధారంగా ఉంటుందని చెప్పుకొచ్చింది. మేనేజర్, సీనియర్ స్థాయి వారికి బిజినెస్ యూనిట్ పెర్ఫామెన్స్ ఆధారంగా చెల్లించనున్నట్లు తెలిపింది. మరోవైపు.. దిగ్గజ దేశీయ కంపెనీ టీసీఎస్ మాత్రం ఉద్యోగాల్లో కోత ఉండదని, కొత్త ఉద్యోగులను కూడా నియమించుకుంటామని ప్రకటన చేస్తుంటే.. మరోవైపు విప్రో ఇలా చేయడం ఏం బాలేదని ఫ్రెషర్లు, ఉద్యోగార్థుల అసహనం వ్యక్తం చేస్తున్నారు.