NRI-NRT

అమెరికాలో బాపట్ల విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఏడు నెలలకే శవమై తేలిన వైనం..

అమెరికాలో బాపట్ల విద్యార్థి అనుమానాస్పద మృతి.. ఏడు నెలలకే శవమై తేలిన వైనం..

ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి ఏడు నెలలకే అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళి గ్రామానికి చెందిన గోవాడ రమేష్‌ దంపతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు గోవాడ నాగసాయి గోపి అరుణ్‌ కుమార్‌ (22) ఏపీలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం అమెరికాలోని లాంనార్‌ యూనివర్సిటీలో ఎంఎస్‌ చదవడానికి గతేడాది ఆగస్టులో వెళ్లాడు. అమెరికాలోని టెక్స్‌పోర్టన్‌ ఏరియాలో ఐదుగురు స్నేహితులతో కలిసి ఓ ఫ్లాట్‌లో అద్దెకుంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. అరుణ్‌ కుమార్‌ ఉంటున్న ఇంట్లో ఒక యువతి కూడా ఉంటోంది. ఈ క్రమంలో మార్చి 1 నుంచి అరుణ్‌ కుమార్‌ కనిపించడంలేందంటూ గదిలో ఉంటున్న స్నేహితురాలు అమెరికా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు

క్రమంలో మార్చి 3న అరుణ్‌కుమార్‌ మృతదేహాన్ని వారి నివాసానికి సమీపంలో ఓ నీటి సరస్సులో పోలీసులు గుర్తించారు. అనంతరం మృతుడి స్నేహితులకు, తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం అరుణ్‌ కుమార్‌ మృతదేహాన్ని శనివారం మధ్యాహ్నం స్వగ్రామమైన బాపట్ల జిల్లా మార్టూరు మండలం జొన్నతాళికి చేరింది. పోస్టుమార్టం నివేదిక వస్తేనే కానీ అరుణ్‌కుమార్‌ మృతికి కారణం తెలియదని పోలీసులు వెల్లడించారు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ బిడ్డ అర్థాంతరంగా తనువు చాలించాడని కుటుంబ సభ్యులు హృదయవిదారకంగా రోదించారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి