Business

పనిచేయని ఫోన్లు, పరికరాలు కొనుగోలు చేస్తున్న ఫ్లిప్‌కార్ట్

పనిచేయని ఫోన్లు, పరికరాలు కొనుగోలు చేస్తున్న ఫ్లిప్‌కార్ట్

పనిచేయని పాత స్మార్ట్‌ఫోన్లు, ఫీచర్‌ ఫోన్లు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఎయిర్‌కూలర్లు తదితర గృహోపకరణాలను ఫ్లిప్‌కార్ట్‌ కొనుగోలు చేస్తోంది. ఎక్స్ఛేంజ్‌ ద్వారా పాతవి ఇచ్చి కొత్త ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. ఇందు కోసం హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ప్రవేశపెట్టింది.ఎలక్ట్రానిక్ వ్యర్థాలను (ఈ-వేస్ట్) తగ్గించడంతోపాటు పనికిరాని ఉపకరణాలను డిస్పోజ్‌ చేయడంలో కస్టమర్లు ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగా ఫ్లిప్‌కార్ట్‌ ఈ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ను తీసుకొచ్చింది. అధీకృత విక్రేతలతో భాగస్వామ్యం ద్వారా రీఫర్బిష్‌మెంట్‌, రీసైక్లింగ్ లేదా సరైన డిస్పొజల్‌ ద్వారా ఈ-వ్యర్థాల సంస్కరణ బాధ్యతను ఫ్లిప్‌కార్ట్‌ చేపట్టింది.

ప్రపంచంలో మూడో అతిపెద్ద ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న దేశంగా ఉన్న భారత్‌ ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితిని మార్చాల్సిన ఆవశ్యకతను గుర్తించి ఈ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టినట్లు ఫ్టిప్‌కార్ట్‌ చెబుతోంది. ఈ ప్రోగ్రామ్ ఆకర్షణీయమైన బైబ్యాక్ ఆఫర్‌లు, పని చేయని ఉపకరణాలను ఇంటి వద్దకే వచ్చి పికప్ చేసుకోవడం, హ్యాండ్-ఇన్-హ్యాండ్ ఎక్స్ఛేంజ్‌ ద్వారా కొత్త ఉత్పత్తులను అందిస్తుంది.

ఈ ఎక్స్చేంజ్‌ ప్రోగ్రామ్ అదనంగా పాత మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, ఫీచర్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లను రీఫర్బిష్‌ లేదా డిస్పోజ్‌ చేయడానికి ముందు వాటిలోని డేటా తొలగింపుపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. సమర్థవంతమైన సాంకేతిక ప్రక్రియలు, విస్తృతమైన లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌తో ఒకే సారి కస్టమర్‌లకు అవాంతరాలు లేని సేవలను ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.దీనిపై ఫ్లిప్‌కార్ట్‌ రీ-కామర్స్ సీనియర్ డైరెక్టర్, బిజినెస్ హెడ్ అశుతోష్ సింగ్ చందేల్ మాట్లాడుతూ.. కొత్త ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌ ద్వారా కస్టమర్లు తమ వద్ద ఉన్న పని చేయని ఎలక్ట్రానిక్, ఇతర ఉపకరణాలను ఇచ్చి కొత్త ఉత్పత్తులు కొనుక్కునేలా వినూత్నమైన, సౌకర్యవంతమైన పరిష్కారాన్ని అందించాలనుకుంటున్నట్లు తెలిపారు. దీనివల్ల కస్టమర్లకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడానికి దోహదపడుతుందని పేర్కొన్నారు.